కాంటాలు ఆలస్యం… సి.పి మొక్కజొన్న రైతుల ఆందోళన…
వెంకటాపురం నూగూరు, ఏప్రిల్ 2, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా వెంకటాపురం మండలం బెస్తగూడెం పంచాయతీలో సి.పి మొక్కజొన్న రైతులు కాంటాలు ఆలస్యం కావడంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కండెలు విరిచి బస్తాల్లో ప్యాక్ చేసి రోడ్డుపై లాట్లు పెట్టి వారం రోజులు కావస్తున్నా కంపెనీ నుంచి కాంటాలు వేయకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సుమారు 400 ఎకరాల్లో సాగు చేసిన మొక్కజొన్న పంట బస్తాల్లో ఉండగా ఎండలకు బరువు తగ్గి రైతులకు నష్టం వాటిల్లుతోందని మహిళా రైతు జాడి రుద్ర, దుర్గం రామారావు తెలిపారు. రాత్రింబగళ్లు బస్తాల వద్ద కాపలా కాస్తూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, కంపెనీ ఆర్గనైజర్ స్పందించకపోవడం, ఏజెంట్లు లారీలు లేవని చెప్పడం వల్ల సమస్య మరింత పెరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కాంటాలు వేసేలా చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని మండల వ్యవసాయ అధికారికి ఫోన్ ద్వారా విజ్ఞప్తి చేశారు.









