ములుగుకు చేరిన జాతీయ మహిళా కమిషన్ సభ్యులు
– కలెక్టర్, ఎస్పీలతో సమావేశం
– మేడారంలో జరిగిన సంఘటనపై విచారణ
ములుగు, ఫిబ్రవరి5, తెలంగాణ జ్యోతి : ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర సందర్భంగా ఓ మైనర్ బాలికపై అత్యాచారం జరిగిందంటూ సోషల్ మీడియాలో వచ్చిన కథనాలను సుమోటోగా తీసుకున్న జాతీయ మహిళా కమిషన్ అందుకు విచారణ చేపట్టింది. గురువారం విచారణ కమిటీ సభ్యులు డెలినా ఖోంగ్డప్, కాంచన్ ఖట్టర్ తదితరులు ఢిల్లీ నుంచి ములుగుకు వచ్చి కలెక్టర్ దివాకర టీఎస్, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ లతో ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. 13ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారం జరిగిందనే విషయం నిజమా కాదా..? ఒకవేళ నిజం కానట్లయితే సోషల్ మీడియాలో వచ్చిన కథనాలపై ఎందుకు స్పందించలేదు.? బాలిక ఎవరు..?ఎందుకు దాడి జరిగింది..? అందుకు ఎవరైనా కారణమైతే వారిని అదుపులోకి తీసుకున్నారా..? అనే విషయాలపై కూలంకుషంగా చర్చించినట్లు తెలుస్తోంది.. అదేవిధంగా మేడారం వెళ్లి అక్కడ కూడా విచారణ చేయనున్నట్లు సమాచారం. కాగా, జాతీయ మహిళా కమిషన్ విచారణతో ఈ విషయం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. అసలు బాలికపై అత్యాచారం జరిగిందా.? ఒకవేళ జరిగితే పోలీసులు కట్టుకథ అల్లారా..? జరగకుంటే జాతీయ మహిళా కమిషన్ ఎందుకు సీరియస్ గా తీసుకుంది అనే విషయాలు జిల్లాలో హాట్ టాపిక్ గా నిలిచాయి. ఏదేమైనా మేడారంలో జరిగిన సంఘటనపై ఢిల్లీ స్థాయిలో చర్చ జరగడం స్థానికంగా ఆందోళన కలిగిస్తోంది.






