ములుగు డీఎస్పీ రవీందర్ కు రాష్ట్ర శౌర్య పతకం
డిఎస్పి రవీందర్ ను సన్మానించిన ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్
ములుగు, డిసెంబర్ 31, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎన్.రవీందర్ కు రాష్ట్ర ప్రభుత్వం అందజేసే ప్రతిష్టాత్మకమైన శౌర్య పథకానికి ఎంపికయ్యారు. పోలీసు శాఖలో మంచి పేరున్న రవీందర్ కు శౌర్యపతకం రావడం పట్ల జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ ప్రత్యేకంగా అభినందించి శాలువాతో సత్కరించారు. 2009 బ్యాచ్ కు చెందిన రవీందర్ వివిధ హోదాల్లో ములుగు జిల్లాలో పనిచేశారు. ఏటూరునాగారం సీఐగా పనిచేసిన సందర్భంలోనే డీఎస్పీగా ప్రమోషన్ పొందిన ఆయన గత రెండేళ్లుగా ములుగు కేంద్రంగా విధులు నిర్వర్తి స్తున్నారు. విధినిర్వహణలో చూపిన అసాధారణ ధైర్యసాహసాలు, కర్తవ్య నిష్ఠకు గుర్తింపుగా ఈ పురస్కారం లభించినట్లు ఎస్పీ వెల్లడించారు. ములుగు జిల్లాలోని అటవీ ప్రాంతాలపై మంచి పట్టు, మావోయిస్టు నిరోధక చర్యల్లో చేసిన విశేష కృషి, వరద సహాయక చర్యల్లో చూపిన సమర్థత, అసెంబ్లీ, పార్లమెంట్, ఎమ్మెల్సీ ఎన్నికల బందోబస్తు నిర్వహణ, గ్రామపంచాయతీ ఎన్నికలు, మేడారం మహాజాతర నిర్వహణలో ప్రదర్శించిన నిబద్ధత ప్రశంసనీయమని ఎస్పీ కొనియాడారు. ఇలాంటి అధికారులు జిల్లా పోలీస్ విభాగానికి గర్వకారణమని పేర్కొన్నారు. కాగా, ఆయన జనవరి 26న జరుగనున్న గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఈ శౌర్య పథకాన్ని డీఎస్పీ రవీందర్ అందుకోనున్నారు. ఈ అభినందన కార్యక్రమం లో ఓఎస్డి శివం ఉపాధ్యాయ, ఏటూరునాగారం ఏఎస్పీ మనన్ బట్, అదనపు ఎస్పి సదానందం, డిసిఆర్బి డిఎస్పీ కిషోర్, ఇంటెలిజెన్స్ సీఐ శంకర్ పాల్గొన్నారు.







