కుష్టు వ్యాధి నివారణకు ములుగు జిల్లాలో సమన్వయ చర్యలు
– జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డా. గోపాల్ రావు
ములుగు, డిసెంబర్ 16, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లాను కుష్టి వ్యాధి రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యంగా అందరూ ఐక్యతతో సమన్వయ చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డా. గోపాల్ రావు అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో నిర్వహించిన కుష్టి వ్యాధిగ్రస్తుల గుర్తింపు కార్యక్రమం–2025పై ఒకరోజు ఓరియంటేషన్ ట్రైనింగ్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. కుష్టి వ్యాధి మైకోబాక్టీరియం లెప్రే అనే బ్యాక్టీరియా వల్ల వచ్చే సాధారణ వ్యాధి అని, ఇది శాపం లేదా వంశపారంపర్య వ్యాధి కాదని స్పష్టం చేశారు. చర్మంపై స్పర్శ లేని మచ్చలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని, ప్రారంభ దశలో ఎం.డి.టి చికిత్స అందిస్తే పూర్తిగా నయం అవుతుందని తెలిపారు. ఈ చికిత్స అన్ని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా లభ్యమవుతుందని చెప్పారు. ఈ సందర్భంగా జిల్లా లెప్రసీ ప్రోగ్రామ్ ఆఫీసర్ డా. చంద్రకాంత్ మాట్లాడుతూ, జిల్లాలో 487 టీమ్లతో ఇంటింటి సర్వే నిర్వహించనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం ఈ నెల 18 నుంచి 31 వరకు కొనసాగుతుందని, ప్రజలు ఆరోగ్య సిబ్బందికి సహకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.






