దేవాలయ అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి
వనదేవతలకు మొక్కులు చెల్లించిన మంత్రి సీతక్క
తాడ్వాయి, డిసెంబర్ 15, తెలంగాణ జ్యోతి : మేడారం సమ్మక్క–సారలమ్మ దేవాలయం అభివృద్ధి పనుల్లో వేగం పెంచి, నిర్ణీత గడువులోగా నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ–శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి సీతక్క అధికారులను ఆదేశించారు. సోమవారం దేవాలయ అభివృద్ధి పనులను పరిశీలించిన ఆమె, వచ్చే ఏడాది జనవరి 28 నుంచి జరగనున్న మహా జాతరకు కోటి నర భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున అన్ని ఏర్పాట్లు సకాలంలో పూర్తి చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ సందర్భంగా దేవాలయ గద్దెల పునరుద్ధరణ, దేవాలయ ప్రాంగణంలోని పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెల రాతి నిర్మాణాలు, రాతి స్తంభాల స్థాపన తదితర పనులను నాణ్యత లోపించకుండా త్వరితగతిన పూర్తిచేయాలని సూచిం చారు. మంత్రి వెంట భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఉన్నారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్, ములుగు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి, పూజారులు, మేడారం నూతన సర్పంచ్ పీరీల భారతి వెంకన్న, సంబంధిత అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.







