3వ దశ పంచాయతీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు: జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.
వెంకటాపురం నూగూరు, డిసెంబర్ 15 (తెలంగాణ జ్యోతి): వెంకటా పురం, వాజేడు, కన్నాయిగూడెం మండలాల్లో నిర్వహించనున్న 3వ దశ గ్రామ పంచాయతీ ఎన్నికలను ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పటిష్టంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయా మండలాల్లో నిర్వహించిన సమీక్ష సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను కచ్చితంగా పాటిస్తూ పారదర్శకంగా ఎన్నికలు జరగాలని సూచించారు. ప్రతి అధికారి తనకు కేటాయించిన బాధ్యతలను సమయానికి పూర్తి చేయాలని, ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలింగ్ సిబ్బంది చెక్లిస్ట్ ప్రకారం సామాగ్రిని పరిశీలించుకోవాలని, బ్యాలెట్ పేపర్లు, సీలింగ్, డిపాజిట్ ప్రక్రియలో జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. సమస్యాత్మక కేంద్రాల్లో వెబ్కాస్టింగ్, సిగ్నల్ లేని చోట్ల వీడియోగ్రఫీతో మైక్రో అబ్జర్వర్ల పర్యవేక్షణ ఉంటుందని పేర్కొన్నారు. ఎన్నికల సిబ్బంది పంపిణీ కేంద్రాలకు ఉదయం 10 గంటలలోపు చేరుకోవాలని, 17వ తేదీ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్, మధ్యాహ్నం 2 గంటలకు ఖచ్చితంగా కౌంటింగ్ ప్రారంభించాలని ఆదేశించారు. దివ్యాంగులు, వృద్ధుల కోసం అన్ని పోలింగ్ కేంద్రాల్లో వీల్చైర్ సదుపాయం కల్పించాలని సూచించారు. కౌంటింగ్ పూర్తయిన వెంటనే పరిశీలకుల అనుమతితో ఫలితాలు ప్రకటించాలని తెలిపారు. ప్రజలు ప్రలోభాలకు లోనుకాకుండా గ్రామాభివృద్ధి కోసం ఓటు హక్కు వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు. అనంతరం వాజేడు మండల కేంద్రంలోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో పోలింగ్ సామాగ్రిని ఆయన పరిశీలించారు. ఈ సమావేశాల్లో అదనపు కలెక్టర్ సంపత్ రావు, మండల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంపీఓలు, జోనల్ ఆఫీసర్లు, ఆర్వోలు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.







