కొత్తూరు లక్ష్మీనరసింహ స్వామి ఆలయం అద్భుత కట్టడం
– ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ సీహెచ్.సువర్ణ
– డీఎఫ్వో తో కలిసి దేవునిగుట్టపై ట్రెక్కింగ్ అనుకూలతల పరిశీలన
– అటవీ సంరక్షణపై పలు సూచనలు
ములుగుప్రతినిధి, డిసెంబర్12, తెలంగాణ జ్యోతి: ములుగు మండలం లోని కొత్తూరు సమీపంలోగల దేవునిగుట్టపై నిర్మించిన లక్ష్మీనరసింహ స్వామి ఆలయ కట్టడం అద్భుతమని హైదరాబాద్ ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (హెచ్వో ఎఫ్ఎఫ్) సీహెచ్.సువర్ణ అన్నారు. శుక్రవారం ములుగు మండలం కొత్తూరు దేవునిగుట్ట, ఇంచర్ల ఎకో టూరిజం ప్రాంతాలను ములుగు డీఎఫ్వో రాహుల్ కిషన్ జాదవ్ తో కలిసి సందర్శించిన ఆమె దేవునిగుట్టపై ట్రెక్కింగ్ మార్గం అనుకూలతలను పరిశీలించారు. ఇంచర్ల ఎకో పార్కులో ఏర్పాటు చేసిన వాచ్ టవర్, నీటి కుంటలు, ఇతర అభివృద్ధి పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు. అదేవిధంగా ములుగు అటవీ కార్యాలయంలో వెదురు బొంగులతో బొమ్మలు తయారు చేసిన వారితో మాట్లాడి నైపుణ్యాన్ని అభినందించారు. ఈ సందర్భంగా హెచ్వో ఎఫ్ఎఫ్ సువర్ణ మాట్లాడుతూ పర్యాటక ప్రాంతాల అభివృద్ధి చేపడుతూ ప్రజలకు పర్యావరణ రక్షణ, అటవీ ప్రాంతాల్లో మెలగాల్సిన తీరుపై అవగాహన కల్పించనున్నామన్నారు. అదేవిధంగా పర్యావరణానికి అనుకూలతలు పరిశీలించడంతోపాటు ట్రెక్కింగ్ అనుకూ లతలు కూడా చూశామని, ఫారెస్ట్ ప్రాంతాల్లో అటవీ అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కాళేశ్వరం సీసీఎఫ్ డాక్టర్ బి.ప్రబాకర్, ములుగు డీఎఫ్వో రాహుల్ కిషన్ జాదవ్, ములుగు రేంజర్ డోలి శంకర్, ఎఫ్డీవోలు, డిప్యూటీ ఆర్వోలు, అటవీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.







