గ్రామ అభివృద్ధే నా ఆశయం : బుట్టాయిగూడెం సర్పంచ్ అభ్యర్థి జాడి రాంబాబు
– సీతక్క అండతో, ప్రజల ఆశీర్వాదంతో విజయం సాధ్యమంటున్న కాంగ్రెస్ అభ్యర్థి
తెలంగాణ జ్యోతి, డిసెంబర్ 8, కన్నాయిగూడెం : బుట్టాయిగూడెం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా జాడి రాంబాబును కాంగ్రెస్ పార్టీ ప్రకటించడంతో గ్రామంలో ఎన్నికల ఉత్సాహం పెరిగింది. గ్రామ ప్రజల అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని ఇప్పటికే అనేక కార్యక్రమాలు చేపట్టి విశ్వాసాన్ని గెలుచుకున్న రాంబాబు మంత్రి సీతక్క మార్గదర్శకత్వంతో బుట్టాయిగూడెంను మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్తానని ఎన్నికల ప్రచారంలో హామీ ఇస్తున్నారు. సర్పంచ్ పోటీకి ముందే గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణం, మహిళా అభివృద్ధి చర్యలు, ఇళ్లులేని పేదలకు ఇళ్ల మంజూరులో సీతక్కతో కలిసి ముఖ్యపాత్ర పోషించారు. పేదరికంతో, అనారోగ్యంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు స్వంత ఖర్చుతో వైద్యం అందించడం ఆయన సేవాభావానికి నిదర్శనం. పాఠశాలలో ఆన్లైన్ సౌకర్యం లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని తెలిసిన వెంటనే జియో వైఫై ఏర్పాటు చేయించి మంచి గుర్తింపు పొందారు. యువతకు వాలీబాల్, క్రికెట్ కిట్ల పంపిణీ ద్వారా క్రీడలపై ఆసక్తి పెంపొందించిన రాంబాబు, రక్తదాన శిబిరాలకు అవసరమైన సామగ్రిని అందిస్తూ సామాజిక సేవలో ముందుంటున్నారు. ఇంటింటా ప్రచారంలో ఆయన మాట్లాడుతూ—ప్రజలు తనకు అవకాశం ఇస్తే బుట్టాయిగూడెంను అభివృద్ధి మోడల్గా నిలబెడతానని, ఏ సమస్య వచ్చినా సీతక్క అండతో ప్రజలకు అండగా నిలుస్తానని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ ప్రచారంలో కాంగ్రెస్ అనుబంధ సంఘాల నేతలు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.







