కగార్ ఎన్కౌంటర్లపై న్యాయ విచారణ జరపాలి
– సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు
ములుగు, నవంబర్ 20 (తెలంగాణ జ్యోతి): కగార్ ఆపరేషన్ పేరుతో జరుగుతున్న మావోయిస్టుల ఎన్కౌంటర్లపై న్యాయ విచారణ జరిపించా లని, సుప్రీం కోర్టు స్వయంగా చర్యలు తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ములుగు జిల్లాలోకి ప్రవేశించిన సీపీఐ బస్సు జాత సందర్భంగా ములుగు జిల్లా సహాయ కార్యదర్శి జంపాల రవీందర్ అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లా డారు. సీపీఐ రాష్ట్ర నాయకుడు కలవేన శంకర్ కూడా పాల్గొన్నారు. మావోయిస్టులను కోర్టుకు అప్పగించకుండా టెర్రరిస్టుల్లా వ్యవహరించడం సరికాదని, మావోయిస్టులు కూడా పంథా మార్చుకుని కమ్యూనిస్టులతో ఐక్యంగా రావాలని శ్రీనివాసరావు సూచించారు. బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ ప్రయోజనాలకే కట్టుబడి పనిచేస్తోందని, ఎల్ఐసీ నిధులను ఆదానీ గ్రూపులో పెట్టుబడిగా పెట్టడం ఇందుకు ఉదాహరణ అన్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంపై అఖిలపక్షాలను డిల్లీకి తీసుకెళ్లాలని సీఎం చర్యలు తీసుకోవాలన్నారు. కలవేన శంకర్ మాట్లాడుతూ డిసెంబర్ 26న ఖమ్మంలో జరగనున్న సీపీఐ వందేళ్ల సభకు ప్రజలు భారీగా హాజరవాలని కోరారు. సీపీఐ పేదల కోసం ఎన్నో పోరాటాలు నిర్వహించిందని, భవిష్యత్తులో ఎర్రజెండా పార్టీలు ఏకమై బూర్జువా పార్టీల అన్యాయాలకు ప్రత్యామ్నాయం చూపాలని అన్నారు.ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి తోట మల్లికార్జునరావు, జిల్లా సహాయ కార్యదర్శి జంపాల రవీందర్, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం.డి. అంజద్ పాషా, ములుగు మండల కార్యదర్శి ముత్యాలరాజు, గోవిందరావుపేట్, తాడ్వాయి మండలాల నేతలు బండి నరసయ్య, వాడి సారయ్య, బండారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సుమారు 500 మంది కార్మికులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.







