తాడ్వాయి విలేకరిపై దాడిని ఖండించిన ఏటూరునాగారం జర్నలిస్టులు
– బైక్ ర్యాలీ నిర్వహించి ఏఎస్పీకి వినతి పత్రం అందజేత
ఏటూరునాగారం, జూన్ 24, తెలంగాణ జ్యోతి : తాడ్వాయి మండలానికి చెందిన ఆంధ్రజ్యోతి విలేకరి చల్లగొండ శ్రీకాంత్ రెడ్డి పై కొంతమంది దుండగులు దాడి చేసిన ఘటనను తీవ్రంగా ఖండిస్తూ ఏటూరునాగారం జర్నలిస్టులు సోమవారం ఉదయం బైక్ ర్యాలీ నిర్వహించారు. ఏటూరునాగారం నుంచి ఏఎస్పీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి, అనంతరం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఏఎస్పీకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు అఫ్జల్ మాట్లాడుతూ నిజాన్ని నిర్భయంగా వెల్లడించే జర్నలిస్టులపై దాడులు జరగడం దురదృష్టకరమన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి మచ్చని, దాడికి పాల్పడిన వ్యక్తులను వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. జర్నలిస్టుల భద్రతకు ప్రభుత్వ పరంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏటూరునాగారం ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.