Medaram | జంపన్న వాగు అభివృద్ధికి రూ.5 కోట్లు మంజూరు
– మేడారం జాతరలో కీలకంగా నిలిచే జంపన్న వాగు పర్యాటక అభివృద్ధికి బాట
ములుగు ప్రతినిధి, జూన్ 18, తెలంగాణ జ్యోతి : ప్రపంచ ప్రసిద్ధ మేడారం సమక్క–సారలమ్మ జాతరలో అత్యంత విశిష్టమైన స్థానం కలిగిన జంపన్న వాగు అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం భారీ నిధులు మంజూరు చేసింది. మంత్రి సీతక్క చేసిన విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం రూ.5 కోట్ల నిధులు విడుదల చేసింది. ఈ నిధులతో వాగు పరిసరాలను పర్యాటక దృష్టితో అభివృద్ధి చేయనున్నారు. ప్రతి రెండేళ్లకోసారి జరిగే మేడారం జాతరలో జంపన్న వాగు ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. లక్షలాది భక్తులు ఈ వాగులో పవిత్ర స్నానాలు ఆచరించి సమక్క–సారలమ్మను దర్శించుకుంటారు. ఇలా భక్తుల ప్రవాహం అధికంగా ఉండటంతో వాగు అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి సీతక్క ముందుగా ప్రభుత్వానికి విన్నవించారు. దీంతో రోడ్లు, గదులు, చేంజింగ్ రూమ్స్, ప్రకాశవంతమైన విద్యుత్ లైట్లు, వాగు పరిసరాలలో సుందరీకరణ వంటి అంశాలపై దృష్టి పెట్టేలా నిధులు కేటాయించారు. ఇది కేవలం జాతర కాలానికి మాత్రమే కాదు, ఏడాది పొడవునా వాగును సందర్శించే పర్యాటకులకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు దోహదపడనుంది. నిత్యం వేలాది భక్తులు, పర్యాటకులు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తూ వాగులో స్నానం చేస్తుంటారు. రివర్ఫ్రంట్ అభివృద్ధితో మరింత ఆకర్షణీయంగా, శుభ్రమైన పర్యావరణంగా మార్చే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు సమాచారం.ఈ మేరకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మంత్రి సీతక్క కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ఆశయాలను, ప్రాంతీయ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని తాను ముందుగానే ప్రతిపాదనలు సమర్పించానని, వాటిని ప్రభుత్వం సమగ్రంగా పరిగణించి నిధులు మంజూరు చేయడం గర్వకారణమన్నారు. జంపన్న వాగు అభివృద్ధి మేడారం మహా జాతరను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే దిశగా ముందడుగని మంత్రి పేర్కొన్నారు.