అందాల పోటీలకున్న ప్రాముఖ్యత ఆరుగురి ప్రాణాలకు లేదా..?
– ఆరుగురు యువకులు చనిపోతే రెండు రోజులకు వస్తరా
– చావులను రాజకీయాలతో ముడిపెట్టే సంస్కృతి ఎమ్మెల్యేది
– సర్కారు ఇచ్చే లక్ష ఎక్స్గ్రేషియాను తిరస్కరించండి
– బీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే రూ.5లక్షలు ఇప్పిస్తా
– మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్
మహాదేవపూర్, జూన్ 18, తెలంగాణ జ్యోతి : హైదరాబాద్ లో జరిగిన అందాల పోటీలకు మంథని ఎమ్మెల్యే ఇచ్చిన ప్రాముఖ్యత ఆరుగురు యువకుల ప్రాణాలకు ఇవ్వలేదని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ తీవ్రంగా మండి పడ్డారు. బుధవారం మహాదేవ్పూర్ మండలం అంబట్పల్లి గ్రామానికి చెందిన పట్టి మధుసూదన్, పట్టి శివమనోజ్, తోగరి రక్షిత్, కర్నాల సాగర్ లు గోదావరి లో స్నానానికి వెళ్లి ప్రమాద శాత్తు గల్లంతై మృతి చెందగా వారి దశ దిన కర్మలో పాల్గొన్న ఆయన ఆ కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నిర్లక్ష్యం మూలంగానే ఆరుగురు యువకులు గోదావరి లో ప్రాణాలు కోల్పోయారని అన్నారు. ఒకవైపు బరాజ్లో యువకుల ఆచూకీ కోసం గాలింపు చేపట్టితే హైదరాబాద్లో అందాల పోటీల్లో మంథని ఎమ్మెల్యే పాల్గొన్నా రని ఆయన వివరించారు. రెండు రోజుల తర్వాత యువకుల ఇండ్లకు వచ్చి పరామర్శించి లక్ష రూపాయల ఎక్స్గ్రేషియా ఇప్పిస్తామని చెప్పి వెళ్లాడని, కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదన్నారు. మృతుల కుటుంబాల అవసరాలకు కనీసం రెవెన్యూ అధికారులు సైతం స్పందించ లేదని, అక్కడ షామీయానాలు , నీళ్లు కూడా ఏర్పాటు చేయక పోవడం విడ్డూరంగా ఉందన్నారు. చావులను రాజకీయాలతో ముడిపెట్టి చూసే సంస్కృతి మంథని ఎమ్మెల్యేదని అన్నారు. మృతుల కుటుంబాలకు కేవలం లక్ష ఎక్స్గ్రేషియా ప్రకటించారని, ఇతర రాష్ట్రాల్లో కోటి రూపాయాలు ఇస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అధికారంలో ఉండి మంత్రి హోదాలో ఉండి ముఖ్యమంత్రి సహయ నిధి ద్వారా ఎంతైనా ఇప్పించవచ్చు కదా అని ఆయన అన్నారు. 50ఏండ్లుగా ఓట్లు వేసి అధికారం, పదవులు ఇప్పించే వారి పిల్లలు మృతి చెందితే శ్రీపాద ట్రస్టు ద్వారానైనా ఐదు లక్షల సాయం చేయవచ్చు కాదా అని ఆయన అన్నారు. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో తాను ఎమ్మెల్యేగా ఉండి ఉద్యమకారులు చనిపోతే ఒక్కొక్కరికి రూ.5లక్షల చొప్పున సాయం అందించామని ఆయన తెలిపారు. మనసుంటే మార్గముంటదని, మన వాళ్లు అనుకుంటే ఏదైనా చేయవచ్చు కానీ మంథని ఎమ్మెల్యే నియోజకవర్గ ప్రజలను కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తున్నాడనే విషయం అర్థం అవుతోందన్నారు. రేపటి పౌరులుగా దేశానికి ఉపయోగపడే ఆరుగురు యువకులు మృతి చెందితే కనీసం సాయం చేసి ఆదుకోవాలనే ఆలోచన చేయకపోవడం విడ్డూరమన్నారు. ప్రభుత్వం అందించే లక్ష ఎక్స్గ్రేషియాను మృతుల కుటుంబాలు తిరస్కరించాలని, మూడేండ్లలో మళ్లీ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో వస్తుందని, వెంటనే ఒక్కొక్కరికి రూ.5లక్షల చొప్పున సాయం అందిస్తామని, ప్రభుత్వం నుంచి రాకపోతే సొంతంగా అందిస్తా నని ఆయన హమీ ఇచ్చారు. పరామర్శలు చేసి వెళ్లడం కాదు బాధిత కుటుంబాలకు ఓదార్పు కల్పించే విధంగా వ్యవహరిం చాలని, ఎన్ని కోట్లు ఇచ్చినా పోయిన పిల్లలు తిరిగి రారు కానీ కన్నవారికి భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుందని ఆయన గుర్తు చేశారు.