పేద ప్రజల సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యం : భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు
– ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్ అందజేత
వెంకటాపురం నూగూరు, జూన్ 17, తెలంగాణ జ్యోతి : పేద ప్రజల సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యంగా, పార్టీలకతీతంగా ఇందిరమ్మ లబ్ధిదారులను ఎంపిక చేసి అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రొసీడింగ్స్ ను అందజేస్తున్నట్లు భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు పేర్కొన్నారు. మంగళవారం వాజేడు రైతు వైదికలో, వెంకటాపురం మార్కెట్ యార్డులో వేరు వేరుగా వాజేడు, వెంకటాపురం మండలాలకు చెందిన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరు ఉత్తర్వులను భద్రాచలం శాసన సభ్యులు తెల్లం వెంకట్రావు, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. అందజేశారు. ఈ సందర్భంగా భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ గత ప్రభుత్వం 10 సంవత్సరాలలో ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేదని అన్నారు. వాజేడు, వెంకటాపురం మండలంలలో ఏ ఒక్కరికీ ఇల్లు రాలేదని అన్నారు. పేదవాడి కల సాకారం చేయాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇండ్ల పథకానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు. మండలంలలో పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన గ్రామం లో ఇండ్లు మంజూరు చేసి నిర్మాణం జరుగుతోందని తెలిపారు. మొదటి దఫాలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అంద చేయడం జరుగుతుందని, రానున్న నాలుగేళ్లలో ప్రతి ఒక్క పేదవాడి సొంతింటి కలను నిజం చేస్తామని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇండ్లు మంజూరు చేస్తామని తెలిపారు. ఇప్పటికే ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు వంటి ఎన్నో సంక్షేమ పథకాలను నిర్విరామంగా అమలు చేస్తున్నామని తెలిపారు. ధాన్యం దిగుబడిలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ స్థాయిలో ఉందని, ఇందుకు ప్రభుత్వం, అధికారుల కృషి ఎంతగానో ఉందని తెలిపారు. సోషల్ మీడియాలో కొంతమంది ప్రభుత్వం పై చేస్తున్న దుష్ప్రచారాలను తిప్పి కొట్టాలని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. మాట్లాడుతూ జిల్లాలో పారదర్శకంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జరుగుతోందని తెలిపారు. రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, శాసన సభ్యులు తెల్లం వెంకట్రావు ల చొరవతో ఈ నియోజకవర్గంలోని ప్రతి నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అవుతున్నాయని అన్నారు. జిల్లాలో ఇప్పటికే బేస్మెంట్ లెవల్ కు చేరిన ఇండ్లకు సంబంధించి సొమ్ము ఖాతాలో జమ చేసామని అన్నారు. ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకునే ముందు పంచాయతీ సెక్రటరీ దృష్టిలో ఉంచాలని అన్నారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ పిడి సూర్య నారాయణ, మండల ప్రత్యేక అధికారులు, ప్రజా ప్రతినిధులు, మండల అధికారులు, లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.