పాలెం ప్రాజెక్టును పరిశీలించిన సీడబ్ల్యూసీ కేంద్ర బృందం
– నీటి సామర్థ్యం, సాగునీటి పంపిణీ అంశాలపై సమగ్ర అధ్యయనం
వెంకటాపురం నూగూరు, జూన్ 5, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో నీటిపారుదల శాఖ నిర్వహణలో ఉన్న పాలెం ప్రాజెక్టును గురువారం కేంద్ర నీటి సంఘం (CWC) చెందిన ఉన్నత స్థాయి ఇంజినీరింగ్ బృందం గురువారం పరిశీలించారు. ప్రాజెక్టు నిర్మాణ లక్ష్యాలు, నీటి నిల్వ సామర్థ్యం, సాగునీటి పంపిణీ, గేట్ల నిర్వహణ తదితర అంశాలపై వారు సమగ్ర సమాచారం సేకరించారు. ఈ సందర్భంగా సీడబ్ల్యూసీ సెంట్రల్ నోడల్ ఆఫీసర్ ప్రితుల్ కుమార్, గ్రౌండ్ వాటర్ సైంటిస్టు కిరణ్, డిప్యూటీ డైరెక్టర్ చరణ్ నాయకత్వంలోని బృందం ప్రాజెక్టు స్థలాన్ని సందర్శించింది. ప్రాజెక్టుకు వరదల ద్వారా వచ్చే నీరు, క్యాచ్మెంట్ ఏరియా ఇన్కమింగ్, అవుట్గోయింగ్, గేట్ల నిర్వహణ, కాలువల ద్వారా సాగునీటి విడుదల తదితర సాంకేతిక అంశాలపై అవగాహన పొందారు. వాటి నిర్వహణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సమీక్షించి అవసరమైన సూచనలు జారీ చేశారు. ప్రాజెక్టు పరంగా గతంలో ఏర్పడిన సవాళ్లు కూడా ఈ సందర్భంగా చర్చకు వచ్చాయి. 2005లో ప్రారంభమైన ఈ ఎర్త్ డ్యామ్ నిర్మాణం, రెండు పర్యాయాల్లో భారీ వరదల వల్ల గండ్లు ఏర్పడిన దృష్ట్యా, నిపుణుల సిఫార్సుల మేరకు గేట్లు ఏర్పాటు చేశారు. ఈ పరిశీలనలో ఉమ్మడి వరంగల్, ములుగు జిల్లాల నీటిపారుదల శాఖ ఇంజినీర్లు ఎస్సీ వై. మోహన్ రావు, ఈఈ జగదీష్, డీఈ కిషోర్, ఏఈ కార్తీక్ తదితరులు పాల్గొని ప్రాజెక్టు నిర్మాణ దశ, ప్రస్తుత పరిస్థితి, నిర్వహణలో ఉన్న సాంకేతిక అంశాలపై కేంద్ర బృందానికి సమగ్ర వివరాలు అందించారు.