భద్రకాళి అమ్మవారి బోనాలు తాత్కాలికంగా వాయిదా
– రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రకటన
– రాజకీయ విభేదాలను అమ్మవారికి ముడిపెట్టి ఇబ్బందులు సృష్టిస్తారనే నిర్ణయం
హైదరాబాద్, తెలంగాణజ్యోతి : ప్రతిష్టాత్మకంగా వరంగల్ భద్రకాళి అమ్మవారికి బోనాలు నిర్వహించేందుకు గతంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వెల్లడించారు. అయితే, ఇటీవల భద్రకాళి బోనాలకి సంబంధించి కొంతమంది నుంచి అభ్యంతరాలు వెలువడిన నేపథ్యంలో, పలు మాధ్యమాల్లో ఈ విషయంపై తప్పుడు వార్తలు ప్రచురితమైన దృష్ట్యా, ఈ కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేయాలని అనుకున్నట్టు స్పష్టం చేశారు. ప్రస్తుతం స్థానికంగా నెలకొన్న రాజకీయ విభేదాలను… పవిత్రమైన అమ్మవారికి ముడిపెట్టి కొంతమంది ఉద్దేశపూరితంగా ఇబ్బందులు సృష్టిస్తారమో అని… ఈ కార్యక్రమంలోకి అసాంఘిక శక్తులను ప్రేరేపించి గొడవలు సృష్టిస్తారన్న అనుమానంతో తాత్కాలికంగా బోనాలు నిర్వహణ రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా, భద్రకాళి అమ్మవారి టెంపుల్ పరిధిలో శాఖాహార బోనాలే ఉంటాయని స్థానిక ఈఓ, వేడపండితులు, ప్రభుత్వం పలుమార్లు పునర్ఘాటించారని అన్నారు. ఆగమ శాస్త్రం ప్రకారమే, వేద పండితుల నిర్ణయం మేరకు భద్రకాళి టెంపుల్లో నిర్వహించాలని అనుకున్నమ న్నారు. అయితే కొంత మంది మాంసాహారంతో బోనాలు నిర్వహిస్తున్నట్టు చెప్పడంతో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్ళాయని చెప్పారు. రాజకీయాల కోసం భక్తుల మనస్సుల్లో తప్పుడు భావాలు నింపడం సహేతుకం కాదన్నారు. ఈ మేరకు శుక్రవారం మంత్రి సురేఖ మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. 22వ తారీఖు భద్రకాళి అమ్మవారి టెంపుల్ లో నిర్వహించాలన్న బోనాలను తాత్కాలికంగా రద్దు చేయాలని భావించినట్టు వివరించారు. స్థానిక ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని… భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగొద్దని ఈ నిర్ణయం తీసుకున్నామని, భద్రకాళి అమ్మవారి బోనాల నిర్వహణపై సంప్రదింపులు జరిపిన అనంతరం భవిష్యత్ కార్యాచరణ ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు వెల్లడించారు. ఈ సందర్భంగా భక్తులకు తెలియజేయదలచినది అమ్మవారి పట్ల నిష్కల్మషమైన భక్తి, సంప్రదాయాల పరిరక్షణ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు. కొంతమంది ప్రచారం చేసిన సమాచారం వల్ల ఏర్పడిన అపోహలకు తావులేదన్నారు. భద్రకాళి అమ్మవారి విశిష్టతను పెంపొందిం చేందుకు, ప్రభుత్వం వేద పండితుల సలహా మేరకు, ప్రజా ప్రతినిధుల సూచనల ఆధారంగా తగిన సమయంలో బోనాలను వైభవంగా నిర్వహించేందుకు కట్టుబడి ఉందన్నారు.