ఇందిరమ్మ మోడల్ హౌస్ నిర్మాణానికి చెట్టు అడ్డు
వెంకటాపురం,జూన్29, తెలంగాణ జ్యోతి : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇందిరమ్మ ఇంటి మోడల్ హౌస్ నిర్మాణానికి చెట్టు అడ్డుగా మారింది. ములుగు జిల్లా వెంకటాపురం మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో 400 గజాల్లో నిర్మిస్తున్న నమూనా ఇల్లు నాలుగు నెలలు గడుస్తున్నా పూర్తికాలేదు. నిర్మాణ స్థలంలో ఉన్న పెద్ద చెట్టు, దాని కొమ్మలు స్లాబ్ దశలో ఉన్న నిర్మాణానికి ఆటంకంగా నిలిచాయి. దీంతో హౌసింగ్ శాఖ పనులను నిలిపివేసింది. లబ్ధిదారులు నమూనా ఇల్లు చూడటానికి వస్తున్నా, నిర్మాణం నిలిచిపోవడంతో మొండి గోడలే దర్శనమిస్తున్నాయి. చెట్టు తొలగించేందుకు ఏటూరు నాగారం అగ్నిమాపక సిబ్బంది ఆదివారం వచ్చి కొమ్మలు కట్ చేస్తే గోడలపై పడే ప్రమాదం ఉందని, పక్కనే ఉన్న కొమరం భీం విగ్రహంపై పడే అవకాశాలు ఉన్నాయని చెబుతూ ఫైర్ సిబ్బంది చెట్టును తొలగించేందుకు నిరాకరించారు. చెట్టు తొలగించక ముందే ఇల్లు నిర్మించడం హౌసింగ్ శాఖ నిర్లక్ష్యానికి నిదర్శన మని నమూనా ఇల్లు పనులు ఈ స్థాయిలో ఆగిపోవడం బాధాకరమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ముందస్తు ప్రణాళిక లేకుండానే పనులు మొదలుపెట్టారని ఇది ప్రజాధనం వృథా అయ్యేలా చేస్తుందని విమర్శిస్తున్నారు.