భూపాలపల్లి మెడికల్ కాలేజీ అభివృద్ధిపై సమీక్ష
- టిజిఎంఎస్ ఐడిసి ఎండీ ఫణీందర్ రెడ్డి
కాటారం, జూన్ 25, తెలంగాణ జ్యోతి : భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటైన మెడికల్ కాలేజీ అభివృద్ధిపై తెలంగాణ మెడికల్ సైన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ ఫణీందర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఆయన బుధవారం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఉస్మానియా వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డా. రాజారావు, టీజీఎంఎస్ఐడిసిలోని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రసాద్ లతో కలిసి కాలేజీ మరియు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ఏడాది మొదలవుతున్న ఎంబీబీఎస్ తరగతుల కోసం అవసరమైన మౌలిక వసతులు, విద్యా మరియు వసతి సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. విద్యార్థులకు ల్యాబ్లు, ప్రయోగశాలలు, పరికరాలు, హాస్టళ్ల వంటి వసతులు పూర్తిగా అందుబాటులోకి రావాలని పేర్కొన్నారు. అలాగే, ప్రభుత్వ ఆదేశాల మేరకు మెడికల్ కాలేజీ మరియు ఆసుపత్రిలోని అన్ని విభాగాలను పరిశీలించి, వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శికి పూర్తి నివేదిక సమర్పించ నున్నట్లు ఆయన తెలిపారు. జాతీయ వైద్య కమిషన్ (NMC) నిబంధనల ప్రకారం మౌలిక సదుపాయాలు మరియు సిబ్బంది వివరాలు క్షేత్రస్థాయిలో పరిశీలనకు వచ్చినట్లు చెప్పారు. పర్యటనలో గుర్తించిన అంశాలపై సమగ్ర నివేదికలు రూపొంది స్తున్నామన్నారు. జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ.. విద్యార్థుల వసతి సదుపాయాల కోసం సింగరేణి సంస్థ నుండి ప్రత్యేక బ్లాక్ కేటాయించనున్నట్లు తెలిపారు. అధికారులు విద్యార్థుల హాజరు, సిబ్బంది వివరాలు, పరికరాల పరిస్థితిని సమీక్షించి తగిన సూచనలు అందించారు. అనంతరం, ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించి న TGMSIDC ఎండీ, పనుల్లో వేగం పెంచడంతో పాటు నాణ్యతా ప్రమాణాలను పాటించాలని సూచించారు. ఆసుపత్రి లోని ఓపీ, ఇన్ పేషెంట్ విభాగాలు, మెడికల్ పరికరాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డా. రాజేంద్ర ప్రసాద్, ప్రభుత్వ ఆసుపత్రి పర్యవేక్షకుడు డా. నవీన్ కుమార్, ఇంజనీరింగ్ విభాగాల అధికారులు తదితరులు పాల్గొన్నారు.