ఆప్యాయ సేవలకు గుర్తింపు
- ఘనంగా మడే నాగేశ్వరరావు గౌరవ సభ
ఏటూరునాగారం, జూన్ 28, తెలంగాణ జ్యోతి : ఏటూరు నాగారం మండలంలోని చిన్నబోయినపల్లి ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా దీర్ఘకాలంగా సేవలందించి న మడే నాగేశ్వరరావు కు ఉద్యోగ విరమణ సందర్భంగా ఆత్మీయ అభినందన సభ ఘనంగా నిర్వహించబడింది. చిన్నబోయినపల్లి పాఠశాల ఆవరణలో జరిగిన ఈ గౌరవ సభలో గిరిజన శాఖ అధికారులు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, పాఠశాల సిబ్బంది, పూర్వ విద్యార్థులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. మడే నాగేశ్వరరావు 1990లో తాడ్వాయి మండలంలోని సీతారాంపురంలో ఏకో ఉపాధ్యాయుడిగా తన విద్యా సేవలను ప్రారంభించి సాంబయ్యపల్లి, గూడూరు, సర్వాయిగూడెం, చుంచుపల్లి, కోమటిపల్లి, రాయని గూడెం వంటి పలు ప్రాంతాల్లో పనిచేశారు. 2012లో చిన్న బోయినపల్లిలో గెజిటెడ్ హెడ్ మాస్టర్గా బాధ్యతలు చేపట్టి, పాఠశాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. తన సేవా కాలంలో ఉత్తమ విధానాలు అమలు చేసి విద్యా ప్రమాణాలను మెరుగు పరిచిన ఆయనకు పలు గౌరవాలు లభించాయి. ముఖ్యంగా 2016లో ఐటిడిఏ పిఓ అజయ్ కుమార్ ఐఏఎస్ చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, చక్రధర్ రావు చేతుల మీదుగా ప్రతిభా పురస్కారం, అంకిత్ ఐఏఎస్ చేతుల మీదుగా ఉత్తమ హెడ్ మాస్టర్ అవార్డులను అందుకున్నారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు తమ విద్యా రోజుల్లో ఆయన నుండి పొందిన ప్రేరణను స్మరించుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ కార్యక్రమాన్ని ఉపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్షులు దారావత్ రాజు, పోదెం కృష్ణప్రసాద్, డిప్యూటీ వార్డెన్ రాజారాం తదితరులు విజయవంతంగా నిర్వహించారు.