వీధి పశువుల బెడదతో వెంకటాపురం ప్రజలు అవస్థలు
- చర్యలు తీసుకోవాలని పంచాయతీ అధికారులకు ప్రజల విజ్ఞప్తి
వెంకటాపురం, జూన్26, తెలంగాణ జ్యోతి : వెంకటాపురం పట్టణ కేంద్రంలో వీధి పశువులు ప్రజలకు నిత్యం తలనొప్పిగా మారాయి. యజమానులు ఎవరో తెలియని ఈ పశువులు నిత్యం ప్రధాన రహదారులపై సంచరిస్తూ వాహనదారులకు, దుకాణదారులకు, పాదచారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నా యి. స్థానిక శివాలయం నుండి కనకదుర్గమ్మ ఆలయం వరకు సుమారు 1.5 కిలోమీటర్ల మేర, బస్టాండ్ సెంటర్, అంబేద్కర్ సెంటర్ వంటి రద్దీ ప్రాంతాల్లో పశువులు గుంపులుగా చేరి రోడ్డుపై విశ్రాంతి తీసుకుంటున్నాయి. ఈ కారణంగా ద్విచక్ర వాహనాలు, ఆటోరిక్షాలు, కార్లకు మార్గంగా మారుతుండటంతో ప్రజలు ప్రమాదాలకు గురవుతున్నారు. పశువులు పరస్పరం కుమ్ములాడుకోవడం, ఆకస్మాత్తుగా పరుగులు తీయడం వల్ల పాదచారులు భయభ్రాంతులకు లోనవుతున్నారు. మరోవైపు, వీధి పశువులు రహదారి పక్కన ఉన్న కూరగాయలు, పళ్ళు, ఆకుకూరల షాపులలోకి చొచ్చుకుని వస్తువులను నాశనం చేస్తున్న ఘటనలు పలు మార్లు చోటుచేసుకున్నాయి. రాత్రివేళ షాపుల ముందు వేసిన షెడ్లు, పందిళ్ల క్రింద పశువులు పడుకుంటూ మూత్రం, పేడల ద్వారా అపరిశుభ్రతకు దారి తీస్తున్నాయి. ఉదయం పూట వ్యాపారులు ముందుగా వాటిని శుభ్రం చేయాల్సి రావడంతో గణనీయమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో వీధి పశువులను పట్టుకొని బందెల దొడ్డిలో వేసి యజమానులపై కఠినమైన జరిమానాలు విధించాలని ప్రజలు కోరుతున్నారు. పంచాయతీ అధికారులు వెంటనే స్పందించి, వీధి పశువుల సమస్యకు శాశ్వత పరిష్కారం తీసుకురావాలని పట్టణ వాసులు, వ్యాపారులు, వాహన దారులు కోరుతున్నారు.