Mulugu | జలపాతాల సిరి.. ములుగు గిరి...
– పర్యాటక ప్రాంతాలకు నెలవుగా ములుగు జిల్లా
– హోయలొలుకుతున్న జలసిరులు
– వెలుగులోకి వచ్చిన తాపాళ జలపాలతం
– రామప్ప, మల్లూరు, మేడారంలు ఆధ్యాత్మిక నెలవులు
– పర్యాటకుల తాకిడీ
– ట్రెక్కింగ్ పునరుద్ధరించాలని విజ్ఞప్తి
ములుగు ప్రతినిధి, తెలంగాణ జ్యోతి : ఔరా అనిపించే అద్భుత దృశ్యాలు ములుగు జిల్లా సొంతం... హోయలొలికించే జలపాతాల సవ్వడులతో పర్యాటకులను మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు జలపాతాలు సందడి చేస్తున్నాయి. ములుగు జిల్లా వాజేడు, వెంకటాపురం మండలాల్లోనే ఈ జలపాతాలు ఉన్నాయి. తెలంగాణ నాయాగారగా పేరుగాంచిన బొగత జలపాతం మినహా మిగిలిన వన్నీ అడవిలో సుమారు 5కిలోమీటర్ల నుంచి 12కిలోమీటర్ల వరకు కాలినడకన వెళ్లాల్సిందే. వన్యప్రాణుల సంరక్షణ దృష్ట్యా కొన్ని జలపాతాలకు అటవీ అధికారులు అనుమతి ఇవ్వడంలేదు.
– కొంగొత్త తాపాళ జలపాతం..
జిల్లాలో మరో జలపాతం వెలుగులోకి వచ్చింది. వెంకటాపురం మండలం పాత్రపురం గ్రామానికి 10 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అటవీ ప్రాంతంలో ‘తాపాళ’ జలపాతం వెలుగులోకి వచ్చింది. ఒకే దగ్గర రెండు వైపులా నుంచి జాలువారుతున్న జలపాతాన్ని చూసేందుకు కష్టతరమైనా పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు. 100 అడుగుల ఎత్తు నుంచి కిందికి దూకుతున్న జలపాతం సవ్వడిన చేస్తుంటే రెండు కళ్ళు సరిపోవు అనిపిస్తోంది. ఇక్కడికి చేరుకోవాలంటే సాహసం చేయాల్సిందే...
–తెలంగాణ నయాగారా బొగత...
వాజేడు మండలంలోని జగన్నాథపురం మీదుగా చీకుపల్లి అటవీ ప్రాంతంలో బొగత జలపాతం పరవళ్లు తొక్కుతోంది. మహారాష్ట్ర, ఛత్తీస్ఘడ్ అడవుల్లో కురిసే భారీ వర్షాల వరదలకు బొగత ఉప్పొంగి ప్రవహిస్తుంది. 98అడుగుల ఎత్తు నుంచి జాలువారే ఈ అందాల సుందర దృశ్యాలను చూసేందుకు హైదరాబాద్ నుంచే కాకుండా రాష్ట్రం నుంచి పర్యాటకులు తరలివస్తారు. హైదరాబాద్ నుంచి వచ్చే వారు హన్మకొండకు చేరుకోవాలి. అక్కడినుంచి ములుగు మీదుగా గోవిందరావుపేట, పస్రా, తాడ్వాయి, ఏటూరునాగారం చేరుకోవాలి. అక్కడి నుంచి ముల్లకట్ల బ్రిడ్జి మీదుగా గోదావరి నదిని దాటి వాజేడు మండలంలోని జగన్నాథపురం ద్వారా బొగతాకు చేరుకుంటారు. ములుగు నుంచి ఏటూరునాగారం 53కిలోమీటర్లు. అక్కడి నుంచి బొగత జలపాతం 27కిలోమీటర్లు ఉంటుంది. హన్మకొండ నుంచి వచ్చేవారు మాత్రం 130కిలోమీటర్లు ప్రయాణిస్తే బొగత చేరుకోవచ్చు.
–ముత్యాల జలధార ముత్యంధార..
ములుగు జిల్లా వెంకటాపురం మండల పరిధిలోని వీరభద్రవరం సమీప అటవీ ప్రాంతంలో ముత్యంధార జలపాతం పరవళ్ళు తొక్కుతుంది. చుట్టూ పచ్చని చెట్లు.. పక్షుల కిలకిలారావాలు.. ఎత్తైన కొండలు.. వాటి మధ్యలో నుంచి 700 అడుగల ఎత్తు నుంచి పాలధారలా జాలూవారే జలపాతం. వింటుంటేనే చూడాలని అనిపిస్తోంది కదూ.. జలపాతం, పచ్చని చెట్లు, పక్షుల సవ్వడులంటే ఇష్టపడని వారు ఎవరుంటారు. ప్రకృతి ప్రేమికులను అమితంగా ఆకట్టుకుంటున్న బొగత, తాపాళ జలపాతాలతో పాటు ముత్యందార కూడా ములుగు జిల్లాలోనే ఉంది. కానీ ఆ జలపాతం చాలా మందికి తెలియదు. దాన్ని కొందరు ముత్యాలధార జలపాతమని, మరికొందరు వీరభద్రమ్ జలపాతం, అని ఇంకొందరు ముత్యం ధార జలపాతమని పిలుస్తుంటారు. కాగా అధికారికంగా ఈ జలపాతం వద్దకు అనుమతులు లేనప్పటికీ పర్యటకులు తరలివస్తున్నారు. ఈ వీడియోను మంత్రి కేటిఆర్ సైతం సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశారు. హైదరాబాద్ నుంచి ముత్యాల ధార జలపాతం దాదాపు 310 కి.మీ దూరం, ఏటూరునాగారం నుంచి కేవలం 40 కి.మీ, వాజేడు నుంచి 10 కిలోమీటర్ల దూరంలో వీరభద్రపురం గ్రామానికి చేరుకోవాలి. వీరభద్రపురం నుంచి జలపాతం దాదాపు 7 నుంచి 12 కి.మీ ఉంటుంది. ట్రెక్కింగ్ ప్రియులకు ఇది అమితంగా నచ్చుతుంది.
– కొంగాల సవ్వడులు..
ములుగు జిల్లాలో మరో జలపాతం కొంగాల.. జగన్నాథపురం సమీపంలో 5కిలోమీటర్లు కాలినడకన ప్రయాణిస్తే కొంగాల జలపాతానికి చేరుకోవచ్చు. సుమారు 200అడుగుల ఎత్తు నుంచి జాలువారే ఈ జలపాతం సందర్శకులను పరవశింపజేస్తోంది. బొగత వచ్చే పర్యాటకులు ఈ జలపాతాన్ని కూడా సందర్శించవచ్చు. అయితే కొందరు పర్యాటకులు ఈత సరదాతో అందులోకి దిగి నీటి ఉధృతి పెరగడంతో మృత్యువాత పడ్డారు. దీంతో ఇక్కడికి ఆంక్షలతో కూడిన సందర్శనకు అనుమతి ఇస్తున్నారు. పర్యాటకులు ఈ నాలుగు జలపాతాలను సందర్శించి కుటుంబ సభ్యులతో అనుభూతి పొందాలని, ఈత రాకున్నా కూడా నీళ్లలోకి వెళ్లొద్దని అటవీ, పర్యాటక శాఖ అధికారులు కోరుతున్నారు.
–యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప అద్భుత శిల్పాలు..
కాకతీయుల కళానిధికి, వారి పాలనకు నిలువుటద్ధం రామప్ప ఆలయం. అదేవిధంగా రామప్ప, లక్నవరం సరస్సులు కూడా ప్రజల జీవనాధారమైన నీటిని పునరుద్ధించేందుకు ఏర్పాటుచేయడం వారి పాలనాదక్షతకు నిదర్శనం. అద్భుత శిల్ప సంపద, ఆలయ కూర్పు ప్రపంచంలోనే అత్యంత విలువైన సంపద రామప్ప ఆలయంలో ఉంది. 12వ శతాబ్ధంలో గణపతి దేవుడు నిర్మింపజేసిన ఈ ఆలయానికి 2021, జూలై 25న యునెస్కో గుర్తింపు లభించింది. ములుగు జిల్లా కేంద్రానికి 15కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. రామప్ప ప్రధాన ఆలయంతోపాటు చుట్టూ 13ఉపాలయాలు సుందరంగా నిర్మించారు. హన్మకొండ నుంచీ ఈ ఆలయానికి రావాలంటే ములుగు నుంచి వెంకటాపూర్ మండల కేంద్రం మీదుగా పాలంపేటకు చేరుకోవాలి. అక్కడి నుంచి కిలోమీటరు దూరంలో రామప్ప ఆలయం ఉంది. ఆలయంలోకి సూర్యకిరణాలు గర్భగుడికి ఎదురుగా ఉన్న నందీశ్వరుడిపై పడి మంటపం నాలుగు పిల్లర్ల మీదుగా రిఫ్లెక్ట్ పొంది గర్భగుడిలోని శివలింగం పై పడడం ఇక్కడి విషేషం. ఆలయ గోపురంపై నీళ్లలో తేలే ఇటుకలతో పేర్చడం మరో విశేషం. రామప్ప సరస్సు కింద 4000ఎకరాల ఆయకట్టు సాగవుతోంది.
– లక్నవరం సరస్సు..
వరంగల్ నుంచి 70 కిలోమీటర్ల దూరంలో గోవిందారావుపేట మండలం బుస్సాసూర్ వద్ద లక్నవరం సరస్సు ఉంది. పిక్నిక్ స్పాట్ గా పేరుగాంచిన లక్నవరం సరస్సు గుట్టలు, అటవీ ప్రాంతం మధ్య అలల సవ్వడులతో హుషారు తెప్పిస్తుంది. కుటుంబ సమేతంగా ములుగు జిల్లా కేంద్రం నుంచి 25కిలోమీటర్లు వెళితే లక్నవరం చేరుకోవచ్చు. ఈ సరస్సును కూడా కాకతీయ రాజులు నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. కాకతీయ రాజు ప్రతాపరుద్రడు ఈ సరస్సు నిర్మింపజేశారు. ఈ సరస్సు కింద సుమారు 6వేల ఎకరాల ఆయకట్టు సాగవుతోంది. పర్యాటక అధికారులు ఉయ్యాల వంతెనలను నిర్మించారు. ఈ సరస్సు నుంచి వెళ్లే మత్తడి నీరు మేడారం సమ్మక్క సారలమ్మ జాతర సమీపంలోని జంపన్నవాగులో కలుస్తాయి. సరస్సు కింద నిర్మాణ సమయంలోనే రంగాపూర్, శ్రీరాంపతి, నర్సింహులకోట అనే పంట కాలువలను నిర్మించారు. పర్యాటకులకోసం ప్రత్యేక దీవులను ముస్తాబు చేశారు.
–వనదేవతలు సమ్మక్క సారలమ్మలు..
ఆసియాలోనే అతిపెద్ద జాతరగా పేరుగాంచిన మేడారం వనదేవతలు సమ్మక్క, సారలమ్మలు ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో కొలువై ఉన్నారు. గుడి, గోపురం, విగ్రహం లేని ఆదివాసీ అడవి బిడ్డల ఆరాధ్యదైవాలు సమ్మక్క, సారలమ్మలు. కో అంటే కోటి మందికి పైగా ప్రతీ రెండేళ్లకోసారి జరిగే మహాజాతర సందర్భంగా అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. అమ్మవార్లకు పసుపు, కుంకుమ, చీరె,సారె, బెల్లం(బంగారం) సమర్పించడం ఇక్కడి ప్రత్యేకత. శివసత్తుల పూనకాలు, ఇసుకవేస్తే రాలనంత జనం ప్రతీ రెండేళ్లకోసారి కుంభమేళాను తలపిస్తుంది ఈ ప్రాంతం. మాఘశుద్ధ చవితి నాడు మహాజాతర నిర్వహిస్తారు. ఆదివాసీ బిడ్డలు కొక్కెర, చందా, సిద్ధబోయిన తదితర వంశస్తుల ఇలవేల్పులైన సమ్మక్క, సారలమ్మ జాతర అంటే ప్రతీ ఒక్కరికీ సంబురం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తోపాటు ఛత్తీస్ఘడ్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి మేడారం తరలివస్తుంటారు. ములుగు జిల్లా కేంద్రం నుంచి గోవిందరావుపేట, పస్రా, ప్రాజెక్టు నగర్, నార్లాపూర్ మీదుగా మేడారం చేరుకోవచ్చు. అదేవిధంగా తాడ్వాయి మండల కేంద్రం నుంచి కూడా మేడారం వెళ్లొచ్చు. ములుగు నుంచి సుమారు 46కిలోమీటర్లు ఉంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1996లో రాష్ట్ర పండుగగా గుర్తించగా, తెలంగాణలో 2014లో ఈ జాతరను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించింది.
–మహిమగళ్ల దేవుడు మల్లూరు హేమాచల నర్సింహస్వామి..
మన భారత దేశంలో ఎన్నో దేవాలయాలు ఎన్నో పేరుప్రఖ్యాతులు గాంచి ప్రసిద్ధి చెందాయి. అలాంటి వాటిలో ములుగు జిల్లా మంగపేట మండలంలోని మల్లూరులో కొలువుదీరిన శ్రీ హేమాచల నరసింహ స్వామి దేవాలయం ఒకటి. ప్రహ్లాదుడికి ముక్తిని ప్రసాదించడానికి విష్ణుమూర్తి ఎత్తిన అవతారమే నరసింహ అవతారం. పుణ్యక్షేత్రాలు తెలుగు రాష్ట్రాలలో తొమ్మిది ఉన్నాయి. ఈ తొమ్మిది క్షేత్రాలను నవ నరసింహ క్షేత్రాలు అనే పిలుస్తారు. ఈ 9క్షేత్రాలలో మొట్టమొదటిగా ఎంతో ప్రసిద్ధిచెందినది మల్లూరు హేమాచల లక్ష్మీనరసింహస్వామి ఆలయం. హేమాచల లక్ష్మీనరసింహ స్వామిగా వేల ఏళ్లనుంచి పూజలందుకుంటున్నాడు. మల్లూరు గ్రామానికి 8కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయం హేమాచలం అనే కొండ మీద ఉంది. పురాణ కథల ప్రకారం సాక్షాత్తు ఆ దేవ దేవతలే ఇక్కడ స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్టించారాని చెబుతారు. ఈ ఆలయంలో ఉన్న స్వామివారి విగ్రహం మానవ శరీరంలో మాదిరి మెత్తగా దర్శనమిస్తుంది. ఈ ఆలయంలో ఉన్న స్వామి వారి విగ్రహం అచ్చం మానవ శరీరం వలె మెత్తగా ఉండటమే కాకుండా, ఛాతి మీద రోమాలు కూడా మనకు దర్శనమిస్తాయి. స్వామి వారి శరీరం ఎక్కడ తాకినా మెత్తగా ఉంటుంది. మల్లూరి లక్ష్మీ నరసింహస్వామి దర్శనార్థం పర్యాటకులు వేలమంది తరలివస్తుంటారు. ఈ ఆలయానికి బ్రహోత్సవాలు కూడా నిర్వహిస్తుంటారు. ఆలయ సమీపంలో నిత్యం జలధార ప్రవహిస్తూ ఉంటుంది. చింతామణి జలపాతంగా పేరుగాంచిన ఈ జలధార అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఈ హేమాచల క్షేత్రంపై ఎంతో విలువైన ఔషధ మొక్కులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మొక్కల నుంచి జాలువారే జలానికి ఔషధ గుణం కూడా ఉంటుందని చరిత్ర. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఎకో టూరిజం వారు నిత్యం పర్యాటకులను ఆకర్శించేదుకు ట్రెక్కింగ్ ఏర్పాటు చేసేవారు. రెండు రోజులు ఒక రాత్రి పేరుతో ప్యాకేజీ ఏర్పాటు చేసేవారు. కరోనా ముందు వరకు ఈ ట్రెక్కింగ్ కోసం పర్యాటకులు విరివిగా వచ్చేవారు. ఏటూరునాగారం, తాడ్వాయి అడవుల నుంచి లక్నవరం సరస్సు మీదుగా సఫారీ రైడ్, ఎడ్లబండి రైడ్, జీపు, సైకిల్ రైడింగ్, ఇలా ఎన్నో ప్రత్యేకతలతో ప్రత్యేక ప్యాకేజీతో అటవీ, ఎకో టూరిజం అధికారులు నిర్వహించేవారు. టూరిజం మేనేజర్గా పనిచేసిన కళ్యాణపు సుమన్ ఆధ్వర్యంలో ట్రెక్కింగ్ నిర్వహణకు ఎక్కువగా ప్రాచుర్యం పొందింది. అయితే ఆయన హైదరాబాద్ కు బదిలీ అయిన అనంతరం పట్టించుకునేవారే కరువయ్యారు. ఈనేపథ్యంలో మళ్లీ ట్రెక్కింగ్ ఏర్పాట్లు చేయాలని పర్యాటకులు కోరుతున్నారు. ఇంకేంటి ములుగు జిల్లాలో పర్యటించేందుకు కుటుంబసమేతంగా రెడీ కండి.. అద్భుత జలపాతాలు, పుణ్యక్షేత్రాలు, సుందర సరస్సులు, మేడారం వనదేవతలను దర్శించుకొని తరలించండి..
మీ తెలంగాణ జ్యోతి.. న్యూస్ డెస్క్.. : 98485 52224, 6309462123