మేడారం, బాసర ఆలయాల అభివృద్ధిపై సీఎం రేవంత్ సమీక్ష
హైదరాబాద్, సెప్టెంబర్ 8 (తెలంగాణ జ్యోతి): మేడారం, బాసర ఆలయాల అభివృద్ధి పనులపై సోమవారం ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మేడారం మహా జాతర నాటికి భక్తులకు సౌకర్యాలు కల్పించేలా ఆలయాన్ని అభివృద్ధి చేయాలని సీఎం సూచించారు. 100 రోజుల్లో మేడారం అభివృద్ధి పనులు పూర్తి అయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. మేడారం అభివృద్ధికి సంబంధించి పలు డిజైన్లను పరిశీలించిన సీఎం, నిర్మాణాలు సహజసిద్ధమైన రాతి కట్టడాల రూపంలో ఉండాలని సూచిం చారు. భక్తుల సౌకర్యార్థం ఎంట్రీ, ఎగ్జిట్, పార్కింగ్ వసతులను కల్పించాల్సిందిగా ఆదేశించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని జంపన్న వాగులో నీరు నిలిచేలా చెక్డ్యామ్ లు నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం స్పష్టం చేశారు. ఈ వారంలో మేడారంకు వెళ్లి క్షేత్రస్థాయి పరిశీలన చేస్తానని తెలిపారు. బాసర జ్ఞాన సరస్వతీ ఆలయ విస్తరణ, అభివృద్ధికి సంబంధించిన పలు సూచనలు చేస్తూ, అన్ని దేవాలయాల అభివృద్ధిలో స్థానిక సెంటిమెంట్ను గౌరవించాల ని, స్థానిక నిపుణులు, పూజారుల అభిప్రాయాలను పరిగణన లోకి తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఈ సమీక్షలో మంత్రులు కొండా సురేఖ, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.