మతిస్థిమితం కోల్పోయి ఉరివేసుకున్న చాంద్ పాషా
వెంకటాపూర్, జూన్ 30,తెలంగాణ జ్యోతి : మండలంలోని లక్ష్మీదేవిపేట గ్రామానికి చెందిన మహమ్మద్ చాంద్ పాషా (33) మతిస్థిమితం కోల్పోయి ఆదివారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన విషాదాన్ని మిగిల్చింది. కుటుంబ సభ్యుల తెలిపిన వివరాల ప్రకారం… ఇటీవల చాంద్ పాషా సోదరుడు మృతి చెందడంతో తీవ్ర మనోవేదనకు గురైన ఆయన, అప్పటి నుండి మానసిక పరిస్థితి మెరుగుగా లేదని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి 9:30 గంటల సమయంలో ఉరివేసుకున్నట్లు తల్లి రజియా పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలిసిన వెంటనే వెంకటాపూర్ ఎస్ఐ చల్ల రాజు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి తల్లి చెప్పిన ప్రకారం, తన కుమారుడు అన్న మృతిని తట్టుకోలేక మతిస్థిమితం కోల్పోయాడని ఎస్ఐ పేర్కొన్నారు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.