భూపాలపల్లిలో డ్రగ్స్ నివారణపై అవగాహన ర్యాలీ
- ప్రతి ఒక్కరూ కంకణబద్ధులవ్వాలి
– రూ.2920 కోట్ల రుణ ప్రణాళిక ఆవిష్కరణ
కాటారం, జూన్ 26, తెలంగాణ జ్యోతి : మత్తు పదార్థాల మహమ్మారిని సమాజం నుంచి తరిమివేయాలంటే ప్రతి ఒక్కరూ కంకణబద్ధులవ్వాల్సిందేనని భూపాలపల్లి జిల్లా ప్రధాన న్యాయమూర్తి పీహెచ్ రమేష్ బాబు పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మత్తు పదార్థాల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని, భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని డా. బి.ఆర్. అంబేద్కర్ క్రీడా ప్రాంగణం నుండి ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వరకు మంగళవారం ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లల అలవాట్లను గమనించాలి. డ్రగ్స్కు అలవాటుపడిన వారిలో వచ్చే మార్పులు గుర్తించి, ఇంటి నుంచే మార్పు ప్రారంభించాలని తెలిపారు. డ్రగ్స్ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు న్యాయసేవాధికార సంస్థల సేవలు వినియోగించుకోవాలని సూచించారు. కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ, డ్రగ్స్ నిర్మూలన కోసం ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని, అందులో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరమన్నారు. అనంతరం కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి కన్సల్టేటివ్ కమిటీ (DCC), రివ్యూ కమిటీ (DLRC) సమావేశంలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి జిల్లా వార్షిక రుణ ప్రణాళికను రూ.2920.33 కోట్లుగా ఆమోదించారు. 2024-25లో రూ.2565.06 కోట్ల లక్ష్యానికి వ్యతిరేకంగా రూ.1923.32 కోట్లు రుణాలు మంజూరై 74.98 శాతం పురోగతిని నమోదు చేసినట్టు కలెక్టర్ వివరించారు. వ్యవసాయ రంగం, MSME, విద్య, గృహ నిర్మాణ రంగాల్లో రుణాల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. గ్రామీణాభివృద్ధిలో బ్యాంకుల పాత్ర కీలకమైందని, మహిళా సంఘాల ఆర్థిక అభివృద్ధికి బ్యాంక్ లింకేజ్ రుణాలు అందించాల్సిందిగా కలెక్టర్ సూచించారు. బ్యాంకింగ్ సేవలపై వచ్చిన ఫిర్యాదులపై అవసరమైతే స్టేట్ కమిటీకి నివేదిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఏ. నాగరాజు, ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్.ఆర్. దిలీప్ కుమార్ నాయక్, అడీషనల్ జడ్జి జి. అఖిల, అడీషనల్ కలెక్టర్లు పి. అశోక్ కుమార్, విజయలక్ష్మి, ఎక్సైజ్, పోలీసు, సంక్షేమ, విద్యా శాఖల అధికారులు, న్యాయవాదులు, విద్యార్థులు, బ్యాంకర్లు తదితరులు పాల్గొన్నారు.