నిరుపేదలకు ఇందిరమ్మ పథకంలో ఇల్లు నిర్మిస్తాం
– రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
కాటారం,తెలంగాణజ్యోతి: రాష్ట్రంలో నిరుపేదలకు ఇందిరమ్మ పథకంలో పూర్తి స్థాయిలో గృహలు మంజూరు చేస్తామని, దశలవారీగా గ్రామాలలో నిరుపేదలు నీడ లేకుండా ఉండరని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు. గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం లో ధన్వాడ గ్రామంలో ఇందిరమ్మ పథకం లో ఇళ్ల నిర్మాణానికి భూమి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి పూజ చేశారు. ఇండ్లు లేని నిరుపేదలకు ఇండ్లు నిర్మిస్తామని ఆనాడు హామీ ఇచ్చామని, ఇచ్చిన హామీ మేరకు దశలవారీగా స్థలాలున్న అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తునట్లు రాష్ట్ర, ఐటి పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. ధన్వాడ గ్రామంలో బొడిగె భాగ్య, చేకుర్తి పావని, ఆత్కూరి దుర్గ, తాటి పల్లవి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భం గా మంత్రి మాట్లాడుతూ మంథని నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాలకు మొదటి విడతలో 1733 ఇందిరమ్మ ఇండ్లు మంజూరైనట్లు తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని ప్రతి గ్రామం లో ఇండ్లు లేని నిరుపేదలను ఎంపిక చేసినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణ కార్యక్రమాన్ని మొదలు పెట్టి దిగ్విజయంగా ముందుకు వెళుతున్నట్లు తెలిపారు. నిరు పేదలు ఇల్లు కట్టుకోవాలని కన్న కలలు గత 10 సంవత్సరాలలో నెరవేరలేదని అన్నారు. ఆనాటి ప్రభుత్వం ఇండ్ల నిర్మాణం చేయలేదని, ఎన్నో ఏళ్లుగా ప్రజలు ఎదురు చూశారని, అలాంటి వారిని దృష్టిలో పెట్టుకొని ఇల్లు లేని నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. మొదటి దశలో ఇంటి స్థలాలు ఉండి ఇండ్లు లేని వారిని ఎంపిక చేశామని మంత్రి వివరించారు. ఇండ్ల నిర్మాణాలను సబ్ కలెక్టర్ నిరంతర పర్యవేక్షణ చేయాలని సూచించారు. నిర్మాణంలో ఎప్పటి కప్పుడు ఇండ్ల ప్రగతి ఫోటోలు పోర్టల్ లో అప్లోడ్ చేయాలని, తప్పుడు ఫోటోలు పోస్ట్ చేస్తే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఏఐ ద్వారా పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని సూచిం చారు. నిర్మాణ పనులను వేగవంతం చేయాలని గృహ నిర్మాణ శాఖ అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం 400 నుండి 600 ఎస్ఎఫ్టి వరకు పరిమితి ఉందని, కొలతలు పెంచడానికి అవకాశం లేదని మంత్రి స్పష్టం చేశారు. ఎలాంటి అక్రమాలకు తావులేకుండా అర్హులైన ఇండ్లు లేని నిరుపేదలకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కులగణన కార్యక్రమాన్ని చేపట్టి పూర్తి చేసామని తెలిపారు. ఎన్ని విమర్శలు ఎన్ని అడ్డంకులు కల్పించిన ఆలోచన చేసిన విధంగా ప్రభుత్వం లెక్క చేయక, ఎలాంటి ఇబ్బంది జరగకుండా ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించి దేశానికి ఆదర్శంగా నిలిచినట్లు తెలిపారు. సర్వేను అడ్డుకోవాలని చూసిన వాళ్ళు లబ్దిపొందాలని చూడటం అవివేకమని ఆయన స్పష్టం చేశారు. సర్వే కార్యక్రమం విజయవంతంగా ముగిసి దేశానికి ఆదర్శంగా నిలిచిందని, దేశ వ్యాప్తంగా సర్వే చేయు టకు సహకారం అందిస్తామని తెలిపారు. అనంతరం గ్రామస్థు లను మీ పిల్లలను ఎక్కడ చదివిస్తున్నారని అడిగి తెలుసు కున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులను హైదరా బాద్, ఢిల్లీకి పంపిస్తానని తెలిపారు. బడిబాట కార్యక్రమాన్ని చేపట్టి బడిఈడు పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించే విధంగా పెద్ద ఎత్తున అవగహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, గృహ నిర్మాణశాఖ పిడి లోకిలాల్, డిఆర్డిఓ నరేష్, డిపిఓ వీరభద్రయ్య, గృహ నిర్మాణ శాఖ ఏఈ రాయలింగు, తహసిల్దార్ నాగరాజు, ఎంపీడీవో బాబు ఎంపీఓ వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.