హనుమకొండలో అదృశ్యమైన వెంకటాపురం యువకుడు దారుణ హత్య
– సంతాప సూచికంగా వెంకటాపురం బంద్
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా మండల కేంద్రంలోని వెంకటాపురం పట్టణానికి చెందిన చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ అధిపతి చిడెం సాయి ప్రకాష్ ఈనెల 15వ తేదీన తన సొంత కారులో హనుమకొండకు తన బంధువులను ప్రైవేటు ఆస్ఫత్రి కి తీసుకువెళ్లి ఆరోజు నుండి అదృశ్యమయ్యారు. హనుమకొండ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు కాగా, పోలీసుల దర్యాప్తులో సాయి ప్రకాష్ హత్యకు గురైనట్లు సోమవారం రాత్రి సమాచారం వచ్చింది. అయితే ఇంతవరకు హత్యకు గల కారణాలు పోలీస్ శాఖ నుండి వెలువడలేదు. రక్తదాన శిబిరాలు, సమాజ సేవ, ఇంకా అనేక ప్రజా సేవ చేసే మంచి యువకుడుగా మంచి పేరు వున్న చిడెం సాయి ప్రకాష్ (30) దారుణ హత్యకు గురవటం పట్ల వెంకటా పురం, వాజేడు మండలాల ప్రజలు, బంధుమిత్రులు తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేశారు. అందుకు నిరసనగా మండల కేంద్రంలో మంగళవారం వారాంతపు సంతను కూడా లెక్కచేయకుండా స్వచ్ఛందంగా షాపులన్నీ మూసివేశారు. దారుణ హత్యకు గురైన సాయిప్రకాష్ హత్యను పలువురు తీవ్రంగా ఖండిస్తు న్నారు.