ఇప్పగూడెం ఇసుక ర్యాంపులో టిప్పర్ బీభత్సం
– టిప్పర్ లారీ ఢీకొని విరిగిపోయిన విద్యుత్ స్తంభం
– అంధకారంలో అనేక గ్రామాలు.
– డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్న విద్యుత్ అధికారులు
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండలం రామచంద్రపురం గ్రామ పంచాయతీ పరిధిలోని ఇప్పగూడెం వద్ద శుక్రవారం వేకువజామున ఇసుక డంపింగ్ జరుగుతుండగా ఓ టిప్పర్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో 33/11 కెవి విద్యుత్ లైన్ స్తంభం విరిగి తీగలు తెగిపడి పలు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విషయం తెలుసుకున్న వెంటనే విద్యుత్ శాఖ ఏఈ అజ్మీర్ హనుమాన్ దాస్, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. టిప్పర్ తాళాలను స్వాధీనం చేసుకొని డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. విద్యుత్ శాఖ నిబంధనల మేరకు నష్టపరిహారం వసూలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఇసుక మాఫియా ప్రభుత్వ నిబంధ నలకు విరుద్ధంగా అర్ధరాత్రి సమయంలో భారీ వాహనాలతో ఇసుక డంపింగ్ చేస్తూ ప్రజలకు ప్రమాదాలు కలిగిస్తోందని, దీన్ని వెంటనే నిలిపివేసి గిరిజనులకు ట్రాక్టర్ల ద్వారా ఇసుక తవ్వకం ద్వారా ఉపాధి కల్పించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.