తాడ్వాయి మండలంలో పులి కలకలం
– కిన్నెర సాని టు తాడ్వాయి ఫారెస్ట్
– పంబాపూర్ సమీపంలో పెద్దపులి అడుగులు గుర్తింపు
తాడ్వాయి/ ఏటూరునాగారం తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లాలో పులి సంచారం కలకలం రేపుతోంది. మూడు రోజులుగా పులి సంచారంతో జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో జనం భయాందోళనకు గురవుతున్నారు. తాడ్వా యి మండలం పంబాపూర్ గ్రామ సమీపంలో గల అడవిలో బుధవారం రాత్రి పెద్దపులి సంచారంతో అడుగుజాడలను గుర్తించినట్లు ఎఫ్ఆర్ఓ సత్తయ్య తెలిపారు. గురువారం అంబాపూర్ అడవులలో గాలించగా ఇసుకలో పులి అడుగు జాడలు గుర్తించామని ఆయన అన్నారు. రాంపూర్ నార్త్ బీట్ సైడు ఒంటరిగా వెళ్లవద్దని తెలిపారు. మూగజీవాల కాపరులు అడవిలోకి వెళ్లవద్దని సూచించారు. కాగా మూడు రోజుల క్రితం ములుగు జిల్లాలోని వెంకటాపురం మండలంలో ప్రవేశించిన పెద్దపులి అదేరోజు చుంచుపల్లి వద్ద గోదావరి దాటి మంగపేట మండలంలోకి ప్రవేశించింది. మరుసటి రోజు మంగపేట మండలంలోని పినపాక మండలం కిన్నెరసాని అడవుల వైపు వెళ్లినట్లు ప్రచారం జరిగింది. కాగా అధికా రులు అనుకున్నట్లుగానే పినపాక మండలంలోని అడవుల నుంచి తిరిగి ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలంలో అడుగుపెట్టింది. పంబాపురంలోని రైతులు గుర్తించి ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో పులి సంచారం పట్ల అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. పులికి ఎలాంటి హాని కలిగించొద్దని హెచ్చరిస్తున్నారు.