Telangana | ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల విడుదల
హైదరాబాద్, తెలంగాణ జ్యోతి : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఇంటర్ ఫలితాలను ఇంటర్మీడియట్ బోర్డ్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చేతుల మీదుగా ఫలితాలను విడుదల చేసింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలను ఒకేసారి విడుదలయ్యాయి. నాంపల్లి లోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో విక్రమార్క ఫలితాలను విడుదల చేసారు. ఈ కార్యక్రమంలో ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య సహా అధికారులు పాల్గొన్నారు. ఇంటర్ ఫలితాలు నేరుగా ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్సైట్ tsbie.cgg.gov.in లో అందుబాటులో ఉంటాయి. రిజల్ట్స్ కోసం విద్యార్థులు తమ హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేసి ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలను మార్చి ఐదు నుంచి 25వ తేదీ వరకు 1532 కేంద్రాల్లో నిర్వహించారు. ఈ పరీక్షలకు 9, 96,971 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరంతా రిజల్ట్స్ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. మార్చి 18 నుంచే స్పాట్ వాల్యుయేషన్ను 19 కేంద్రాల్లో ప్రారంభించిన ఇంటర్ బోర్డు అనుకున్న సమయానికే ఫలితాలు ఇచ్చేలా పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. తొలిసారిగా రాండం రీవాల్యుయేషన్ సైతం నిర్వహించి ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఇంటర్మీ డియట్ బోర్డ్ జాగ్రత్తలు తీసుకుంది. దాదాపు 60 వేల మంది ప్రతి సంవత్సరము రీవాల్యుయేషన్కు అప్లై చేస్తున్నారని దృష్టిలో పెట్టుకొని పాస్ మార్కులకు దగ్గర్లో ఉన్న వారి పేపర్లను రీవాల్యుయేషన్ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. దీంతో రెండు దశల్లో పరిశీలన చేసిన తర్వాతే ఫలితాల వెల్లడికి ఇంటర్ బోర్డు సిద్ధమైంది. సిజిజి ఆమోద ముద్రలతో ప్రభుత్వం అనుమతి తీసుకొని ఫలితాలను వెల్లడించనున్నట్లు అధికారులు తెలిపారు. ఫలితాల వెల్లడి తర్వాత రీకౌంటింగ్, రీవాల్యుయేషన్కు సైతం అవకాశం ఇవ్వనున్నారు. నెల రోజుల్లో సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించేందుకు సైతం ఏర్పాటు చేయనున్నారు.