అడవి జంతువులను వేటాడటానికి విద్యుత్ తీగలు అమరిస్తే కఠిన చర్యలు.
– వెంకటాపురం సి.ఐ. బండారు కుమార్
వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ములుగు జిల్లా వెంకటాపురం మండల పరిధిలో అడవి జంతువులను వేటాడటానికి ఎవరైనా వ్యక్తులు విద్యుత్తు తీగలను అమర్చినట్లు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సి.ఐ. బండారు కుమార్ హెచ్చరించారు. ఈ మేరకు నూగూరు వెంకటాపురం సి.ఐ.బండారు కుమార్ సోమవారం ఒక ప్రకటను విడుదల చేశారు.అడవి జంతువులను వేటాడే వేటగాళ్లు కరెంట్ తీగలను ఏర్పాటు చేయడం వలన, పంట పొలాలకు, పనులకు వెళ్లే రైతులు, జంతువులు షాక్కు గురయ్యి ప్రాణాలను కోల్పోవడం జరుగు తుందని తెలిపారు.జిల్లాలో గతంలో కూడా ఇలాంటి ఘటనలు సంభవించి అమాయకులు ప్రాణాలను కోల్పోవడం జరిగిందని తెలియజేసారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సంబంధిత అధికారులతో సమన్వయం పాటిస్తూ, జంతువులను వేటాడటం కోసం కరెంటు తీగలను ఏర్పాటు చేసే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.భూపాలపల్లి జిల్లాలో కూంబింగ్ ఆపరేషన్లో భాగంగా విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ ఆఫీసర్ అడవిలో అక్రమంగా ఏర్పాటు చేసిన కరెంట్ తీగలకు తగిలి ప్రాణాలను కోల్పోవడం చాలా బాధాకరమని ఈ సందర్భంగా దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు.ఎవరైనా వ్యక్తులు ఈ విధంగా అక్రమంగా కరెంటు తీగలను ఏర్పాటు చేసినట్లు తెలిస్తే వెంటనే పోలీస్ వారికి ఈ క్రింది నెంబర్ కు 8712670114 సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు.