భూభారతితో రైతుల సమస్యలకు పరిష్కారం
– అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
కాటారం, తెలంగాణ జ్యోతి : భూభారతి చట్టంతో రైతుల అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుందని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు శనివారం జిల్లాలోని మలహర్ మండలంలోని కొయ్యూరు, మహాముత్తారం మండలంలోని బోర్ల గూడెం గ్రామాలలో జరిగిన సదస్సు లలో ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. భూ సమస్యలు శాశ్వత పరిష్కారానికి భూ భారతి చట్టం ఎంతగానో ఉపయోగపడుతుందని జిల్లాకలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భూ భారతి చట్టంతో రైతుల భూములకు రక్షణ కల్పించడం జరుగుతుందని అన్నారు. ప్రజల కోసం, ప్రత్యేకించి రైతులకు వారి భూముల హక్కులు కల్పనకు భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చిందని తెలిపారు. ధరణి పోర్టల్లో అనేక సమస్యలకు పరిష్కారం కాకుండా పెండింగ్ ఉన్నాయని, కానీ అలాంటి అన్ని సమస్యలు భూ భారతి చట్టం ద్వారా పరిష్కరించబడతాయని అన్నారు. భూములకు సంబంధించిన సమస్యలపై రైతులు మీసేవలో లాగే దరఖాస్తు చేసుకోవచ్చని, ఏదైనా సమస్య పరిష్కారానికి దరఖాస్తు చేస్తే నిర్దేశించిన సమయంలో పరిష్కరిస్తారని తెలిపారు. ధరణిలో వ్యవసాయ సబ్ డివిజన్ లో ఎలాంటి ప్రస్తావన లేదని, భూభారతి చట్టంలో సబ్ డివిజన్ పై ప్రత్యేక దృష్టిసారిం చారన్నారు. ప్రతి ఏడాది డిసెంబర్ 31న భూ భారతి చట్టంలోని నిబంధనల ప్రకారం భూ రికార్డులను అప్డేట్ చేస్తామన్నారు. రైతులు ఇకపై బ్యాంకు రుణాలకు వెళ్ళినప్పుడు భూములకు సంబంధించిన కాగితాలను సమర్పించాల్సిన అవసరం లేదని, భూ భారతి పోర్టల్ లో నమోదైన రికార్డుల ఆధా రంగానే బ్యాంకర్లు రుణాలు అందచేస్తారని తెలిపారు. రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, సాదాబైనామాకు సంబంధించిన వివరాలు అన్నింటిని రైతులు ఇతర రైతులతో పంచుకోవాలని, చట్టంపై అందరికీ సమగ్రమైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. దీనిపై ఏవైనా సమస్యలు ఉంటే పరిష్క రించుకోవచ్చని, ఒకవేళ రైతులకు ఎవరికైనా న్యాయ సహాయం అవసర మైతే ఉచిత న్యాయ సహాయాన్ని ప్రభుత్వం అందిస్తుం దని తెలిపారు.ఈ చట్టంతో భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుందని తద్వారా భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా ఉంటాయని అన్నారు. ధరణి నుంచి కొత్త పోర్టల్ భూ భారతికి మారుతున్నందున ఎలాంటి లోటుపాట్లు, ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్లడానికి పైలెట్ స్టడీ క్రింద రాష్ట్రంలో 4 మండలాలు ప్రభుత్వం ఎంపిక చేసి రైతు సదస్సులు నిర్వహి స్తున్నట్లు తెలిపారు. మే నెలలో మన జిల్లా నుండి ఒక మండలాన్ని పైలెట్ ప్రాజెక్టు గా ఎంపిక చేసి రెవెన్యూ సదస్సులు నిర్వహించి ప్రజల నుండి సలహాలు, సూచనలు తీసుకో నున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, తహసిల్దార్ రవికుమార్, సింగిల్ విండో చైర్మన్ మొండయ్య తదితరులు పాల్గొన్నారు.