రంగరాజపురం శ్రీ సమ్మక్క – సారలమ్మ తల్లి ప్రధాన పూజారి మృతి
వెంకటాపురంనూగూరు, తెలంగాణజ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రం బి. సి.మరిగూడెం జి. పి. లోని శ్రీ సమ్మక్క సారలమ్మ తల్లి ప్రధాన ఆలయ ధర్మకర్త, ప్రథాన పూజారి చిత్త పూరి సత్యనారాయణ అనారోగ్యంతో మృతి చెందారు. రంగరాజపురం కాలనీలో దశాబ్దాల కాలంగా వెలసిన సమ్మక్క తల్లి ఆలయ ధర్మకర్తగా ఆయన తండ్రి చిత్తపూరి కృష్ణమూర్తి సమ్మక్క సార్లమ్మ తల్లి గద్దెలకు ధశాబ్థా ల పాటు సేవలందించి భక్తులు ఆదరాభిమానాలు పొందారు. ఆయన మరణానంతరం కుమారుడైన చిత్తపూరి సత్యనారాయణ ధర్మకర్తగా, ఆలయ ప్రధాన పూజారిగా ప్రతి ఏట సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహిస్తూ ఆలయ పేరు ప్రతిష్టలకు ఎటువంటి భంగం కలగకుండా పూజలను అందించారు. ఆలయ ప్రధాన ధర్మకర్తగా పూజారిగా సేవలు అందిస్తు, కూరగాయల వ్యాపారం కూడా చేస్తూ జీవనం సాగిస్తున్న సత్యనారాయణ మృతికి సంతాప సూచికంగా కూరగాయల వ్యాపారులు తమ దుకాణాలను మూసివేసి సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు ఆయన స్వగృహానికి వెళ్లి భౌతికకాయం పై పూలమాలలు వేసి కుటుంబ సభ్యులను ఓదార్చి సంతాపం వ్యక్తం చేశారు.