ప్రజావాణి దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలి
– గ్రీవెన్స్ లో 45దరఖాస్తులు స్వీకరించిన కలెక్టర్ దివాకర
ములుగు ప్రతినిధి తెలంగాణ జ్యోతి : ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులు అదనపు కలెక్టర్లు సిహెచ్.మహేందర్ జి, సంపత్ రావు లతో కలిసి జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ స్వీకరించారు. మొత్తం 45దరఖాస్తులు రాగా అందులో 16భూసమస్యలవి, 14గృహనిర్మాణ శాఖ, 2పింఛన్, ఒకటి ఉపాధి కల్పన, 12ఇతర శాఖలకు సంబంధించినవి ఉన్నాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోరుతూ ప్రజలు ప్రజావాణిని ఆశ్రయిస్తున్నారని, వారి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని అన్నారు. ప్రజావాణి పోర్టల్ లోని పెండింగ్ దరఖాస్తులను కూడా పరిష్కరించాలని ఆదేశించారు. పెండింగ్ ఉంటే దానికి గల కారణాలను దరఖాస్తు దారులకు తెలియజేయాలని సూచించారు. కార్యాలయాల చుట్టూ తిప్పుకోవద్దన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లా స్థాయి అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.