ప్రతి నియోజకవర్గంలో పారిశ్రామిక వాడలు
– ఎంఎస్ఎంఈలు ఏర్పాటు చేసేలా యువతకు ప్రోత్సాహం
– మొబిలిటీ వ్యాలీ పార్క్” భూమి పూజలో మంత్రి శ్రీధర్ బాబు
కాటారం, తెలంగాణ జ్యోతి : తెలంగాణను పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చేసేందుకు ప్రతి నియోజకవర్గంలో అంతర్జా తీయ ప్రమాణాలతో పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేయను న్నట్లు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. వీటిల్లో ఎంఎస్ఎంఈ పరిశ్రమలను ఏర్పాటు చేసేలా తెలంగాణ యువతను ప్రోత్సహిస్తామన్నారు. రూ.44.3 కోట్లతో టీజీఐఐసీ ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా మోమిన్ పేట్ మండలం ఎనకతల గ్రామంలో అభివృద్ధి చేయనున్న “మొబి లిటీ వ్యాలీ పార్క్” కు మంగళవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… 862 ఎకరాల్లో ఏర్పాటు చేయబోయే ఈ పార్క్ ద్వారా దాదాపు పదివేల మంది యువత కు ఉపాధి లభిస్తుందన్నారు. పరిశ్రమల ఏర్పాటును కేవలం హైదరాబాద్ కే పరిమితం చేయకుండా… రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించేలా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్నా మన్నారు. రాష్ట్రంలో ఎంఎస్ఎంఈల ఏర్పాటుకు ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని, వాటిని మరింత బలోపేతం చేసేందుకే ప్రత్యేక పాలసీ తెచ్చామన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎంతో మంది పారిశ్రామిక వేత్తలు ముందుకొస్తుంటే, కావాలనే కొంత మంది పనిగట్టుకొని మా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రగతికి అడ్డంకిగా మారే ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని ఇకనైనా మానుకోవాలని హితవు పలికారు. కార్యక్రమంలో స్పీకర్ ప్రసాద్ కుమార్, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎంఎల్ఏలు రామ్మోహన్ రెడ్డి, మనోహర్ రెడ్డి, టీజీఐఐసీ ఛైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు.