ఇసుక రీచ్ లో అక్రమ వసూళ్ల దందాను అరికట్టాలి
– తెలంగాణ ప్రజా ఫ్రంట్ జిల్లా అధ్యక్షుడు పీక కిరణ్
కాటారం, తెలంగాణ జ్యోతి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్, కాటారం మండలంలోని ఇసుక రీచ్ లలో అక్రమ వసూళ్ల దందా ను అరికట్టాలని తెలంగాణ ప్రజా ఫ్రంట్ జిల్లా అధ్యక్షుడు పీక కిరణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఒక్కో లారీకి సీరియల్ కు 1000,లోడింగ్ కు 500, జెసిబికి 300 ఇలా 1800 నుండి 2000 వరకు వసూలు చేస్తున్నారని, రోజుకు 700 నుండి 900 లారీలకు అదనంగా ఇసుక మాఫియా డబ్బులు వసూలు చేస్తున్న తగ్గేదేలే అంటూ వ్యవహరిస్తు న్నారని విమర్శించారు. ఎలికేశ్వరం 2, అంబట్ పల్లి1,2, మహా దేవపూర్(పూసుకు పల్లి)1, పలుగుల 8,9, విలాసాగర్3, రీచ్ ల నుండి ఇసుక రవాణా జరుగుతోందని ముఖ్యమంత్రి ఆదేశాలతో గత నెలలో వారం రోజులు పోలీస్, రెవెన్యూ, మైనింగ్ శాఖల అధికారుల హడావుడి చేశారు.
మళ్లీ షరా మామూలుగా కొనసాగుతున్న వసూళ్ల పర్వం.l
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలో నిర్వహిస్తున్న ఇసుక రీచులలో అక్రమాలు జరుగుతున్నాయని, ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోందని రూ. కోట్ల విలువ చేసే ఇసుక పక్కదారి పడుతుందని నిఘ వర్గాల ద్వారా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అక్రమ ఇసుక రవాణా పై దృష్టి సారించిన సీఎం రేవంత్ రెడ్డి పోలీస్, రెవెన్యూ, మైనింగ్ శాఖ అధికారులను ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేసి ఇసుక రీచ్ లలో నిఘాను పటిష్టం చేశారు. ప్రభుత్వానికి వచ్చే ఆదాయానికి ఇసుక రీచ్ నిర్వాహకులు ఏ విధంగా గండి కొడుతున్నారో అధికారులు ఆరా తీశారు. అదనపు బకెట్, లోడింగ్ చార్జీల పేరుతో ఒక్కో లారీ కి ఐదు నుండి ఏడు వేలు వసూలు చేసినట్టు అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి నివేదికను పంపించారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతుందని భావించిన సీఎం రేవంత్ రెడ్డి అదనపు బకెట్ దందా, లోడింగ్ చార్జి వసూళ్లను అరికట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో పోలీస్ రెవెన్యూ మైనింగ్ శాఖ అధికారులు మూకుమ్మడిగా తనిఖీలు నిర్వహించడంతో వసూళ్ల పర్వం కొన్ని రోజులు సద్దుమణిగింది. దీంతో అధికారులు కూడా అటు వైపు వెళ్లడం ఆగిపోయింది. ఇదే అదునుగా భావించిన ఇసుక క్వారీ నిర్వాహకులు కొత్త దందాకు తెరలేపారు. సీరియల్ పేరుతో రూ 700 , లోడింగ్ చార్జి పేరుతో రూ 500 లారీ డ్రైవర్ల వద్ద నుండి బలవంతంగా వసూలు చేస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే వారి లారీలను లోడింగ్ చేయ కుండా ప్రక్కన పెట్టిస్తున్నారు. ఇసుక రీచ్ లలో నిఘా నేత్రాలను సైతం ఏర్పాటుచేసినప్పటికీ వసూళ్ల పర్వం మాత్రం ఆగడం లేదంటే ఇసుక మాఫియా ఎంతకు తెగించిందో అర్థం అవుతొం దని, సంబంధిత శాఖ అధికారులు కన్నెత్తి కూడా ఇసుక రీచ్ ల వైపు చూడడం లేదని,మామూళ్లకు అలవాటు పడ్డ అధికారు లు ప్రభుత్వానికి ఆదాయం ఏమోగానీ.సామాన్యుడికి మాత్రం ఇసుక భారం గా మారిందని పీక కిరణ్ అన్నారు.