జాబితాలో తన పేరు లేదని గ్రామసభలో ఆత్మహత్యాయత్నం
కన్నాయిగూడెం, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా కన్నాయి గూడెం మండలంలో విషాదం చోటు చేసుకుంది. ప్రభుత్వ పథకాల అర్హుల జాబితాలో తనపేరు లేదని కుమ్మరి నాగేశ్వరరావు అను రైతు ఏకంగా గ్రామసభలోనే అధికారులు ముందు పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నం చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల వివరాలు ప్రకారం… ములుగు కన్నాయిగూడెం మండలం బుట్టాయిగూడెం గ్రామ సభ ఏర్పాటు చేశారు. అయితే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం స్వీకరించిన ప్రజాపాలనలో పలు సంక్షేమ పథకాలకు కుమ్మరి నాగేశ్వరరావు దరఖాస్తు చేసుకు న్నాడు. కాగా, గురువారం గ్రామ సభలో వివిధ పథకాలకు సంబంధించిన అర్హుల జాబితాను అనౌన్స్ చేయగా తాను పెట్టిన అర్జీలలో దేనికి అర్హుడను కాలేదని మనస్థాపానికి గురై అధికారుల ముందే పురుగుల మందు తాగాడు. అయితే అతన్ని అధికారులు, ప్రజలు నిలువరించేందుకు ప్రయత్నించాగా, అప్పటికే అతను పురుగులమందు సగానికి పైగా తాగడం తో హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో 108 లో ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది.