ధాన్యం కొనుగోలు చేయాలంటూ రోడ్డెక్కిన రైతులు
కాటారం, తెలంగాణ జ్యోతి : కాటారం మండలంలోని రేగుల గూడెం గ్రామంలో ధాన్యం కొనుగోలు చేయాలంటూ రైతులు మంగళవారం రాస్తారోకో నిర్వహించారు. తూకంలో కటింగ్ చేస్తూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ప్యాడిక్లీనర్ లు అందుబాటులో ఉంచలేదని, మంథని- కాటారం రహదారిపై వడ్లు పోసి రైతులు నిరసన వ్యక్తం చేశారు. ధాన్యం కుప్పలుగా పోసి ఎన్నో రోజులు గడిచినప్పటికీ ధాన్యం కొనుగోలు చేయడం ఆలస్యం చేశారని రైతులు ఆరోపించారు. రైతులకు అనువైన స్థలంలో కేంద్రం ఏర్పాటు చేయలేదని, కొనుగోలు కేంద్రంలో ధాన్యం ఆరబోసేందుకు స్థలం సరిపోవడంలేదని రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. తూకంలో ఎలాంటి కటింగులు లేకుండా ధాన్యం కొనుగోలు చేపట్టాలని రైతులు డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు చేయడంలో అధికార యంత్రాంగం అనుసరిస్తున్న వైఖరిని రైతులు తీవ్రంగా విమర్శిం చారు. కాటారం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ద్వారా రేగులగూడెం ధాన్యం కొనుగోలు కేంద్రం నడుస్తోంది. ఈ సమస్యపై సీఈవో సతీష్ ను వివరణ కోరగా ధాన్యం ప్యాడి క్లీనర్ లో పోయకుండానే ఒక బస్తా 42 కిలోల తూకం వేసి తీసుకోవాలని రైతులు డిమాండ్ చేయగా నిబంధనల మేరకు ధాన్యం కొనుగోలు చేస్తామని రైతులకు చెప్పినట్లు తెలిపారు. ఒక బస్తా 41 కిలో తూకం వేయాల్సి ఉండగా ప్యాడి క్లీనర్ లో వడ్లు పోయకుండా 42 కిలోలు తూకం వేసి వడ్లు తీసుకోమని రైతులు కోరడంతో నిరాకరించినట్లు వివరించారు. రైతుల సమస్యను జిల్లా సరఫరాల శాఖ డిఎం రాములు కు వివరించగా సంఘటనా స్థలానికి చేరుకొని రైతులతో మాట్లాడినట్లు తెలిపారు.