Erukala nancharamma | నాంచారమ్మ జాతరకు సర్వం సిద్ధం
– కాకతీయుల కాలంలో నిర్మించబడిన పంచకూటాలయం
– పునర్నిర్మాణం పేరుతో ఆలయాన్ని విప్పి కుప్ప పెట్టిన పురావస్తు శాఖ
– ఎరుకలను ఏకం చేసి 2018 నుంచి జాతర నిర్వహణ
– తెలంగాణ ఆదివాసి ఎరకల సంఘం రాష్ట్ర అధ్యక్షులు , నాంచారమ్మ ఉత్సవ కమిటీ చైర్మన్ లోకిని రాజు
వెంకటాపూర్, తెలంగాణ జ్యోతి : ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ పౌర్ణమికి వైభవంగా నిర్వహించబడే ఎరుకల నాంచారమ్మ జాతరకు సర్వం సిద్ధమైంది. మే 12 నుంచి వారం రోజుల పాటు జాతరను నిర్వహించేందుకు ఎరుకల కులస్తులు ఏర్పాట్లు చేశారు. తెలుగుజాతిని ఏకం చేసి పరిపాలించిన కాకతీయుల కాలంలో రామప్ప దేవాలయంతో పాటు ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం రామానుజాపూర్ గ్రామ సమీపంలోని పంట పొలాల్లో 800 సంవత్సరాల క్రితం ఎరుకల నాంచారమ్మ (పంచకూటాలయం) దేవాలయం నిర్మించబడింది. అరుదైన నల్లసేనపురాయితో చెక్కబడిన ఐదు శివలింగాలను, ఇతర అద్భుతమైన శిల్పాలను పునర్నిర్మాణం పేరుతో పురావస్తు శాఖ అధికారులు రామానుజపూర్ గ్రామ సమీపానికి తరలించారు. తర్వాత కాలంలో పట్టించుకోకపోవడంతో భవిష్యత్ తరాలకు అందించాల్సిన అరుదైన శిల్ప సంపద కాలగర్భంలో కలిసి పోతుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
2018 నుంచి జాతర నిర్వహణ
ఎరుకలనాంచారమ్మ దేవాలయంగా పిలుచుకునే పంచకూటాల యం పంటపొలాల మధ్య ఉండడంతో ఎవరూ పట్టించుకోలేదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎరుకల కులస్తులను ఏకం చేసిన తెలంగాణ ఆదివాసి ఎరుకల సంఘం అధ్యక్షుడు లోకిని రాజు 2018 ఏప్రిల్ 29న మొదటిసారి నాంచారమ్మ జాతరను నిర్వహించారు. అన్ని శాఖల అధికారులను సమన్వయం చేస్తూ వారి సహకారంతో జాతరకు ప్రతి ఏడాది కావలసిన సౌకర్యాల ను మెరుగుపరుస్తూ భక్తులకు ఇబ్బందులు కలగకుండా జాతర నిర్వహిస్తున్నారు. తక్కువ జనాభా కలిగిన ఎరుకల కులస్తులు తమ ఆరాధ్య దైవం దర్శనం కోసం ప్రతి సంవత్సరం రామానుజ పూర్ కు తరలివస్తున్నారు.
నాలుగు రాష్ట్రాల నుంచి తరలి రానున్న భక్తులు
వైవిధ్యమైన జీవన విధానం కలిగిన ఎరుకల కులస్తులు జాతరలో సందడి చేస్తారు. తెలంగాణ రాష్ట్రం తో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, చత్తీస్గడ్, రాష్ట్రాలనుండి నాంచారమ్మ కు మొక్కులు చెల్లించుకునేందుకు ప్రతి ఏడాది ఎరుకల కులస్తులు తరలి వస్తుంటారు. మొదటి రోజు జాతరలో వెంకటాపూర్ మండలంలోని లక్ష్మీదేవి పేట గ్రామం నుంచి డప్పు చప్పుల్లు, నాంచారమ్మ, ఏకలవ్యుని వేషధారణలతో రామానుజ పూర్ వరకు తరలివస్తారు. అక్కడ నుంచి శివసత్తుల పూనకా లు, భక్తుల సందడి మధ్య నాంచారమ్మ జాతర వరకు తరలి వెళ్తారు. ఎరుకల కులస్తులు ఆచారాల ప్రకారం నాంచారమ్మ కు బోనంతో మొక్కులు చెల్లించుకుంటారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా జాతరను నిర్వహిస్తుండగా కుర్రో కుర్రు.. అంటూ సోది (భవిష్యత్) చెప్పేందుకు ఎరుకల యువ తులు, మహిళలు, వృద్ధులు నాంచారమ్మ వేషధారణలతో సందడి చేస్తారు. లిపిలేని వీరి భాష ప్రత్యేకంగా ఉంటుంది. రామానుజాపూర్ గ్రామము నుంచి రెండు కిలోమీటర్ల దూరం వరకు భక్తులతో కలిసి సందడిగా తరలి వెళ్తారు. వారం రోజుల పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు నాంచారమ్మకు మొక్కులు చెల్లిస్తారు తిరుగువారం ఎరుకల కులస్తులు ప్రత్యేకమైన మొక్కులు చెల్లించడంతో జాతర ముగుస్తుంది.
-నాంచారమ్మ విగ్రహ ప్రతిష్టకు ఏర్పాట్లు..
పునర్నిర్మాణం పేరుతో విగ్రహాలన్నీ తరలిపోవడంతో ఇప్పటి వరకు ప్రతిఏడాది అక్కడే ఉన్న ప్రత్యేకమైన శిలను నాంచారమ్మ గా భావించి భక్తులు తమ మొక్కులు చెల్లించుకున్నారు. తెలంగాణ ఆదివాసి ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, నాంచారమ్మ ఉత్సవ కమిటీ చైర్మన్ లోకిని రాజు ఆధ్వర్యంలో నాంచారమ్మ విగ్రహాన్ని ప్రత్యేకంగా తయారు చేయించి విగ్రహ ప్రతిష్టాపన చేసేందుకు కావలసిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈనెల 12న వేద పండితుల సమక్షంలో జాతరతో పాటు నాంచారమ్మ విగ్రహ ప్రతిష్టను వైభవంగా నిర్వహించేందుకు కావలసిన ఏర్పాట్లు పూర్తి చేశామని ప్రతి ఒక్కరు సహకరించి జాతరను విజయవంతం చేయాలని లోకిని రాజు కోరారు.