రైతుల భూములకు బూధార్ కార్డులు

రైతుల భూములకు బూధార్ కార్డులు

రైతుల భూములకు బూధార్ కార్డులు

– భూభారతి అవగాహన సమావేశంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

కాటారం, తెలంగాణ జ్యోతి : భూ భారతి చట్టంలో రైతుల భూములకు భూధార్ కార్డులు జారీ చేస్తామని, భూముల వివరాలు సమగ్రంగా నమోదు చేయబడతాయని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. సోమవారం మహాదేవపూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన భూ భారతి నూతన రెవెన్యూ చట్టం అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూ భారతి నూతన రెవెన్యూ చట్టం  ధరణి చట్టంలోని వ్యత్యాసాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ భూ సమస్యలు పరిష్కారానికి అవసరమైన ధరణి స్థానంలో నూతన చట్టం తెచ్చేందుకు. ప్రభుత్వం అన్ని జిల్లాలలో రైతులు, మేధావులు, ప్రజల సలహాలు, సూచనలు పరిగణనలోకి తీసుకుని పటిష్టమైన చట్టాన్ని అమల్లోకి తెచ్చినట్లు తెలిపారు. భూ భార‌తి చట్టం ద్వారా భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. ఈ చ‌ట్టం చేసేముందు ప్రభుత్వం రైతుల క‌ష్టం గురించి ఆలోచించి ప్ర‌త్యేక క‌మిటీ ఏర్పాటు చేసి వివిధ రాష్ట్రాల్లో అమలులో ఉన్న చట్టాలను కూలంకషంగా అధ్యయనం చేసి ఈ నెల 14వ తేదీన అమల్లోకి తెచ్చినట్లు తెలిపారు. చట్టంపై ప్రజలకు అవగాహన కల్పనకు రాష్ట్ర వ్యాప్తంగా 4 జిల్లాలలో 4 మండలాలను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి ప్రజల నుండి సలహాలు, సూచనలు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. అలాగే మన జిల్లాలోని 12 మండలాల్లో భూ భారతి చట్టం అవగహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వచ్చే నెలలో మన జిల్లాలోని ఒక మండలాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి రైతు సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు. దరణిలో ఏదేని పొరపాటు జరిగితే సరిచేసేందుకు అవకాశం లేదని సివిల్ కోర్టు కు వెళ్లాల్సి వచ్చేదని, ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారని తెలిపారు. ఈ చట్టంపై ప్రజలు సమగ్రమైన అవగహన కలిగి ఉండాలని ఆయన సూచించారు. అంతకు ముందు భూ భారతి చట్టంపై తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు ఆటా.. పాటలు ద్వారా అవగాహన కల్పించారు. ఈ అవగాహన సదస్సులో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, తహసీల్దార్ ప్రహ్లాద్ రాథోడ్, ఎంపిడిఓ వెంకటేశ్వర్లు, ఏ డి ఏ శ్రీపాల్, నాయబ్ తహసీల్దార్ కృష్ణ, పిఏసీఎస్ ఛైర్మన్ చల్లా తిరుపతి రెడ్డి, మాజీ ఎంపీపీ బన్సోడ రాణిబాయి , కాంగ్రెస్ నాయకులు ఏనుమండ్ర వామన్ రావు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు,వివిధ గ్రామాల నుండి వచ్చిన రైతులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment