Batti Vikramarka | లాభసాటి వ్యాపార గ్రౌండింగ్ కు పటిష్ట కార్యాచరణ అమలు¾
– డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క.
– లబ్దిదారులకు వ్యాపార నైపుణ్యాల పై సంపూర్ణ శిక్షణ.
– జూన్ 2 నాడు యువ వికాసం లబ్దిదారులకు పోసిడింగ్స్ పంపిణీ.
– రాజీవ్ యువ వికాసం అమలు పై జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన డిప్యూటీ సీఎం.
ములుగు ప్రతినిధి, తెలంగాణ జ్యోతి : రాజీవ్ యువ వికాసం పథకం క్రింద లాభసాటి వ్యాపార యూనిట్ల గ్రౌండింగ్ జరిగేలా పటిష్ట కార్యాచరణ అమలు చేయాలని డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. బుధవారం రాజీవ్ యువ వికాసం అమలు పై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర బీసీ, రవాణా శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామ కృష్ణారావు హైదరాబాద్ లోని సచివాలయం నుంచి అన్ని జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలు నుంచి జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్ రావు తో కలసి పాల్గొన్నారు. రాజీవ్ యువ వికాసం పథకం అమలుకు సంబంధించి చేపట్టిన చర్యలను అధికారులు వివరించారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ, గతంలో ప్రభుత్వాలు కార్పొరేషన్ ద్వారా మొక్కుబడిగా పథకాలు అమలు చేశాయని, తమ ప్రభుత్వం లక్షలాది మంది యువతకు స్వయం ఉపాధి కల్పించాలని చిత్తశుద్ధితో రాజీవ్ యువ వికాసం పథకం అమలు చేస్తుందని అన్నారు. యువ వికాసం పథకం క్రింద వచ్చే సహాయంతో యువత వ్యాపారం చేసి లబ్ది పోందాలని, 8 వేల కోట్ల రూపాయలతో దాదాపు 5 లక్షల మంది యువతకు ఉపాధి మార్గాలు చూపుతామని అన్నారు. ప్రభుత్వం పెట్టే ప్రతి పైసా పెట్టుబడి ఎలా పనిచేస్తుందో కలెక్టర్లు రెగ్యులర్ గా మానిటరింగ్ చేయాలని, రాష్ట్ర జీడిపి వృద్ధి లో ఈ పథకం భాగస్వామ్యం కావాలని అన్నారు. మనం మంజూరు చేసిన యూనిట్ల గ్రౌండింగ్ చేసిన తర్వాత వాటి పని తీరు పర్యవేక్షించేందుకు జిల్లాలో కమిటీ ఏర్పాటు చేయాలని అన్నారు. మే 29, 30 తేదీలలో జరిగే ఇంచార్జి మంత్రి వర్యుల సమావేశాలలో రాజీవ్ యువ వికాసం పై చర్చించి తుది జాబితా ఆమోదం చేయాలని అన్నారు. జూన్ 2 నాడు రాష్ట్ర అవతరణ దినోత్సవ నాడు యువ వికాసం లబ్దిదారులకు ప్రొసీడింగ్స్ పంపిణీ చేయాలని డిప్యూటీ సీఎం సూచించారు. బీసీ రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, రాజీవ్ యువ వికాసం పథకం నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని, లబ్దిదారుల ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రస్తుతం ఎంపిక చేసే లబ్దిదారులకు పూర్తి అవగాహన కల్పించిన తర్వాత యూనిట్ గ్రౌండింగ్ పై దృష్టి పెట్టాలని అన్నారు. ప్రభుత్వం చేసే ఖర్చు పూర్తి స్థాయిలో సద్వినియోగం కావాలని, ఒకే రకమైన యూనిట్లు గ్రౌండ్ కాకుండా చూడాలని అన్నారు. వాహనాలు, ట్రాలీలు, కిరాణా షాపు వంటి యూనిట్లు తక్కువగా గ్రౌండ్ చేయాలని అన్నారు. ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు మాట్లాడుతూ, 6250 కోట్ల సబ్సిడీ, 1667 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు మొత్తం దాదాపు 8 వేల కోట్ల రూపాయలతో 5 లక్షల మంది యువతకు రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు. ప్రభుత్వ అందించే సహాయంతో యువత స్వయం ఉపాధి పోందాలని, రాజీవ్ వివో వికాసం ద్వారా ఆర్థిక ప్రగతి జరగాలని, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్లు యూనిట్ వారీగా గ్రౌండింగ్ చేయాలని సీఎస్ సూచించారు. ఒకే రకమైన యూనిట్ల మంజూరు కాకుండా జాగ్రత్తలు వహించాలని, మనం మంజూరు చేసే యూనిట్ క్షేత్రస్థాయిలో విజయవంతం కావాలని అన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఎస్ సి కార్పొరేషన్ ఈ డి తుల రవి, బి సి, మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ రవీందర్ రెడ్డి, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.