ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలి
కాటారం, తెలంగాణ జ్యోతి : సమస్యల పరిష్కారం కోరుతూ ప్రజావాణికి వచ్చిన ప్రజల దరఖాస్తుల పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడిఓసి కార్యాలయ సమావేశపు హాలులో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని దరఖాస్తులు స్వీకరించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులకు ఎండార్స్మెంట్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడు తూ ప్రజావాణిలో 52 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. అట్టి సమస్యలు పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. దరఖాస్తులను పెండింగ్ ఉంచకుండా, సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని దరఖాస్తులను ఆయా శాఖల అధికారులకు ఎండార్స్ చేసినట్లు తెలిపారు. ప్రజావాణి ప్రధాన ఉద్దేశం ప్రజల ఫిర్యాదులను స్వీకరించి త్వరితగతిన పరిష్కారం చేయడమేనని అధికారులు జాప్యం చేయొద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.