పాలిటెక్నిక్ డిప్లమా కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం
కాటారం,తెలంగాణజ్యోతి : హైదరాబాదులో గల దుర్గాబాయి దేశ్ ముఖ్ ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో 2025- 26 విద్యా సంవత్సరం డిప్లొమా కోర్సులకు అనాధ బాలికలు, నిరాశ్రయులైన బాలికల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఒక ప్రకటనలో తెలిపారు. 240 సీట్లలో 70 శాతం సీట్లు అనాధ, నిరాశ్రయులైన, అక్రమ రవాణా బాధిత బాలికలకు కేటాయించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. పాలిటెక్నిక్ అర్హత ప్రవేశ పరీక్ష రాయకున్నా, పదవ తరగతిలో ఉత్తీర్ణత పొంది ఉండాలన్నారు. మూడు శాతం సీట్లు దివ్యాంగ బాలికలకు కేటాయించారు. ఎంపికైన బాలికలకు ఉచిత విద్యతోపాటు వసతి కల్పిస్తారని, దరఖాస్తు ఫారం, విద్యా అర్హత, కులం, నివాసం, తల్లిదండ్రుల మరణ ధ్రువీకరణ పత్రాలు మే 20వ తేదీ లోపు జి 1, జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం భూపాలపల్లిలో సమర్పించాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఇతర వివరాల కోసం జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయంలో లేదా నెంబర్ 9491051676 నందు సంప్రదించాలి.