వేసవిలో త్రాగునీటికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
– జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
తెలంగాణ జ్యోతి, భూపాలపల్లి ప్రతినిధి : గ్రామాలలో మంచినీటి సరఫరాలో ఎక్కడైనా అంతరాయం ఏర్పడితే అందుకు ప్రత్యామ్నయంగా త్రాగునీరు అందించడానికి చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయం లోని సమావేశ మందిరంలో వేసవిలో త్రాగు నీటి ఎద్దడి నివారణకు చేపట్టిన చర్యలు, వివిధ దశలలో ఉన్న పనుల పురోగతి పై ఆర్.డబ్లూ.ఎస్, గ్రిడ్, మండల ప్రత్యేక అధికారులు, ఎం.పీ.డి.ఓ లతో గ్రామ పంచాయితీల వారీగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా మాట్లాడుతూ జిల్లాలోని 241 గ్రామ పంచాయితీలలో వేసవిలో నీటి ఎద్దడి నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు. సుదీర్ఘ సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా గ్రామ పంచాయతి వారిగా పంచాయతి రాజ్, ఆర్ డబ్ల్యూఎస్ అధికారులను మంచినీటి సరఫరా వివరాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామాలలో మరమ్మత్తులలో ఉన్న బోర్లు, చేతి పంపులు, మంచినీటి పైపులైన్లు లీకేజి మరమ్మత్తులు, నూతన పైపు లైన్ల నిర్మాణానికి ప్రత్యేక అభివృద్ధి నిధులు (ఎస్.డి.ఎఫ్) డి.ఎం.ఎఫ్.టి నిధుల నుండి అన్ని గ్రామ పంచాయితీలకు 3.91 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. మంచినీటి ఎద్దడి సమస్య పరిష్కారానికి పంచాయతి రాజ్, ఆర్ డబ్లు ఎస్ అధికారులు అందచేసిన నివేదికలు ఆధారంగానే నిధులు మంజూరు చేశామని అన్నారు. ఎక్కడైనా మంచినీటి సరఫరాలో ఇబ్బంది వస్తే తక్షణమే తన దృష్టికి తేవాలని తెలిపారు. వేసవిలో నీటి సరఫరాలో ఇబ్బందులు ఎదురైనప్పుడు ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లుతో నీటి సరఫరాకు సిద్దంగా ఉండాలని తెలిపారు. మంచినీటి వనరులు మాత్రమే కాకుండా ప్రైవేటు బోర్లు, బావుల ద్వారా గ్రామాలలో నీటిని అందించడానికి సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. గ్రామాలలో ప్రైవేటు బోర్లు, బావులు ఇతర నీటి వనరుల వివరాలు సేకరించి నివేదికలు అందుబాటులో ఉంచుకోవాలని, అత్యవసర పరిస్థితులలో వాటి ద్వారా గప్రజలకు నీటిని సరఫరా చేయాలని అన్నారు. గ్రామాలలో ప్రజల అవసరాలకు ఎన్ని లీటర్ల నీరు అవసరం, గ్రామంలో ఉన్న ఓహెచ్ఎస్ఆర్ వాటర్ ట్యాంకుల సామర్థ్యం ఎంత, ఎన్ని గంటలు బోర్లు నుండి ట్యాంకులు నింపవచ్చు, అనే అంశాలపై ప్రతి గ్రామ పంచాయితీ కార్యదర్శికి సమగ్రమైన అవగాహన ఉండాలని తెలిపారు. గ్రామాలలో మరమ్మతులు జరుగుతున్న బోర్లు, చేతి పంపులను ఏప్రిల్ 04వ తేదీ వరకు పూర్తి చేసి నివేదికలు అందచేయాలని, ఎక్కడైనా మరమ్మత్తులు పూర్తికాకపోతే అందుకు కారణాలను ఎంపిడిఓ, ఆర్ డబ్ల్యూ ఎస్ సిబ్బంది సంయుక్తంగా దృవీకరణతో నివేదికలు అందచేయాలని ఆదేశించారు. వేసవి కాలం ముగిసేంత వరకు అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఎక్కడా త్రాగునీటికి ఇబ్బంది రావొద్దని ఆయన పేర్కొన్నారు. పురోగతిలో ఉన్న పనులను యుద్ధ ప్రాతిపదికన నిర్దేశిత సమయంలోగా పూర్తి చేయాలని, మరమ్మత్తులకు వినియోగించే సామగ్రి నాణ్యత ఉండాలని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్, జడ్పీ సిఈఓ విజయలక్ష్మి, ఆర్.డబ్లూ.ఎస్ ఈఈ నిర్మల, డి.పి.ఓ నారాయణరావుతో పాటు మండల ప్రత్యేక అధికారులు, ఎం.పీ.డి.ఓలు, ఆర్.డబ్లూ.ఎస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.