నేను మీ ప్రభాకర్ అన్న బిడ్డను : బడే నాగజ్యోతి
తెలంగాణ జ్యోతి, ములుగు ప్రతినిధి : ప్రభాకర్ అన్న మీ అభీష్టం మేరకే ప్రాణాలు అర్పించాడని, మీ ప్రభాకర్ అన్న ప్రాణంగా మీ ఆడబిడ్డగా ఇప్పుడు మీ ముందుకు వచ్చానని బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి అన్నారు. శనివారం తుపాకులగూడెం, లక్ష్మీపురం, దేవాదుల, రాజన్నపేట, కన్నాయి గూడెం, గురేవుల, ముప్పనపల్లి, బుట్టాయి గూడెంలలో నాగజ్యోతి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిస్వార్ధంగా మీకు సేవ చేసేందుకు వచ్చానని, నన్ను గెలిపించి సాదుకుంటారో లేదా సంపుకుంటారో మీ ఇష్టమని, నాకు ఎలాంటి స్వార్థ ప్రయోజనాలు లేవన్నారు. కాంగ్రెస్ నాయకుల లాగా నాకు ఛత్తీస్ ఘడ్లో కాంట్రాక్టు లేవని, ఒక్క అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి భావోద్వేగానికి లోనయ్యారు. మరోసారి ప్రజలను మోసం చేసేందుకు పగటివేష గాళ్లు ఆరు గ్యారంటీలతో వస్తున్నారని, వాళ్ళ మాయ మాటలు నమ్మ వద్దన్నారు. పక్క రాష్ట్రo చత్తీస్గఢ్లో రైతుబంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి తదితర పథకాలు లేవని, అలాంటివారు తెలంగాణ రాష్ట్రంలో ఎలా అమలు చేస్తారని అన్నారు. ఛాతిసఘడ్ లో కేవలం 500 రూ. మాత్రమే పెన్షన్ ఇస్తున్నారని అన్నారు. తెలంగాణలో కెసిఆర్ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి రాగానే 3 వేల రూ. ఇచ్చేందుకు చర్యలు చేపట్టినట్టు తెలిపారు. ఎన్నికల్లో గెలవగానే ఇల్లు లేని ప్రతి కుటుంబానికి పక్కా ఇల్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలు ఒక్కసారి అవకాశం కల్పిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని అన్నారు. అధికార పార్టీ లో ఉంటేనే అభివృద్ధి సాధ్య మైతుందనారు. గిరిజనేతరులకు కూడా పోడుపట్టాలతో పాటు అసైన్డ్ భూములపై పూర్తి హక్కులు కల్పించేందుకు మేనిఫెస్టోలో ఈ అంశాన్ని పొందుపరిచినట్లు గుర్తు చేశారు. కన్నాయిగూడెం మండల కేంద్రంలో ప్రజల అభీష్ట మేరకు బ్యాంకు ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గోదావరి నది నదీ జలాలతో ఈ ప్రాంతం భూములకు పూర్తిస్థాయిలో తాగు సాగునీరు అందించేందుకు కృషి చేస్తానన్నారు.